Maharashtra: గేదెల గుంపు దాడిలో పులి మృతి; వీడియో వైరల్
పులిపై గేదెల గుంపు దాడి చేసి చంపేసిన ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా మూల్ తాలూకాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తొలుత గురువారం తెల్లవారుజామున ఎస్గావ్ గ్రామ పరిసరాల్లో ఓ పులి ఆవుల కాపరిపై దాడికి ప్రయత్నించింది. అతను గొడ్డలితో బెదరించడంతో పారిపోయింది. పులి సంచరిస్తుందన్న విషయం స్థానిక ప్రజలకు తెలియడంతో భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో బెంబాడ గ్రామ అటవీ ప్రాంతంలో మేస్తున్న ఆవులు, గేదెలపై పులి దాడి చేసింది. గేదెలు పారిపోకుండా అన్ని ఏకమై మూకుమ్మడిగా వాటి కమ్ములతో దాడి చేశాయి. పులి గాయపడగా, అటవీ శాఖ అధికారులు వచ్చి, చంద్రాపూర్లో వెటర్నరీ అస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పులి చనిపోయింది.