
TG News: 18 జిల్లాల్లో పెరిగిన భూగర్భ జలమట్టం.. గతేడాది మే నెలతో పోల్చితే 0.30 మీటర్లు పైకి
ఈ వార్తాకథనం ఏంటి
ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ కాలానికి ముందే రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వర్షాలు ప్రారంభమయ్యాయి.
వీటి ప్రభావంతో భూమి ఉపరితలంతో పాటు భూగర్భం కూడా చల్లబడింది.
సాధారణంగా ఎండలతో మాడిపోవాల్సిన మే నెలలో రాష్ట్ర భూగర్భ జల మట్టం గణనీయంగా 0.30 మీటర్ల మేర పెరిగింది.
ఈ విషయమై రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ తాజా నివేదికను విడుదల చేసింది, ఇందులో గతేడాది మే నెలతో పోల్చితే 18 జిల్లాల్లో నీటి మట్టం పెరిగిందని వెల్లడించింది.
వివరాలు
మే నెలలోనే నీటి మట్టం పెరగడం అరుదు
సాధారణంగా భూగర్భ జలాల పెరుగుదల జూన్ నుండి అక్టోబర్ వరకు మాత్రమే కనిపిస్తుంది.
ఆ తరువాత కొన్ని నెలలు స్థిరంగా కొనసాగి, మళ్లీ తగ్గుముఖం పడుతుంది. కానీ ఈసారి మే నెల రెండో వారం చివరి నుంచే వాతావరణం చల్లబడింది.
ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. అంతేకాదు, వేసవి పూర్తవకముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల వర్షాలు ముందుగా ప్రారంభమయ్యాయి.
వర్షాలు పడటంతో పాటు భూగర్భ జల వినియోగం తగ్గడం వల్ల మే నెలలోనే నీటి మట్టం పైకి రావడం మొదలైంది.
ఇలాంటి పరిస్థితులు మే నెలలో జరగడం చాలా అరుదైన విషయమని నిపుణులు పేర్కొంటున్నారు.
వివరాలు
రాష్ట్ర సగటు నీటి మట్టంలో పెరుగుదల
రాష్ట్ర స్థాయిలో సాధారణంగా మే నెలలో భూగర్భ జల మట్టం 10.06 మీటర్లు ఉంటుంది.
కానీ 2025 మే నెలలో ఇది 10.36 మీటర్లకు చేరింది. అంటే 0.30 మీటర్ల మేర పెరిగిందన్నమాట.
గతేడాది మేతో పోల్చితే రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో జల మట్టం పెరిగింది. ఇందులో భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 3.05 మీటర్లు పెరిగింది.
నాగర్కర్నూల్లో 2.74 మీటర్లు, నల్గొండ జిల్లాలో 2.32 మీటర్లు, సూర్యాపేటలో 1.70 మీటర్ల మేర పెరిగినట్లు రికార్డయ్యింది.
అయితే హైదరాబాద్ మరియు హనుమకొండ జిల్లాల్లో మాత్రం అత్యల్పంగా 0.17 మీటర్ల మాత్రమే పెరుగుదల కనిపించింది.
వివరాలు
కొన్నిచోట్ల తగ్గుదల కూడా
2024 మేతో పోల్చితే 2025 మే నెలలో 15 జిల్లాల్లో భూగర్భ జల మట్టం తగ్గినట్లు అధికారులు గుర్తించారు.
ఇందులో సంగారెడ్డి జిల్లాలో 1.61 మీటర్ల మేర నీటి మట్టం తగ్గగా, వరంగల్ జిల్లాలో 0.04 మీటర్లు పడిపోయింది.
అయితే, ఈ జిల్లాల్లో ఏప్రిల్తో పోల్చితే మే నెలలో నీటి మట్టం కొంత మేరకు పెరిగింది.
దీనిని బట్టి ఈ ఏడాది మొత్తం భూగర్భ జలాల స్థితి అనుకూలంగా ఉండే అవకాశముందని భూగర్భ జల వనరుల శాఖ డైరెక్టర్ లక్ష్మా అభిప్రాయపడ్డారు.
వివరాలు
వర్షపాతం 32 శాతం అధికం
2024-25 నీటి సంవత్సర కాలంలో (జూన్ నుండి మే వరకు) రాష్ట్రం మొత్తం మీద 32 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి.
రాష్ట్ర సాధారణ వార్షిక వర్షపాతం 919 మిల్లీమీటర్లు కాగా,ఈసారి 1,216మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై గణనీయమైన పెరుగుదల కనిపించింది.
ఇందులో నారాయణపేట జిల్లా అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లా కావడం గమనార్హం.
అక్కడ సాధారణ వర్షపాతం 618.9మి.మీ.కాగా ఈసారి 1,184.1మి.మీ. నమోదైంది. ఇది 91శాతం అధికం.
వనపర్తిలో 80 శాతం,మహబూబ్నగర్,జోగులాంబ గద్వాల జిల్లాల్లో 71 శాతం,నాగర్కర్నూల్లో 58 శాతం అధిక వర్షాలు కురిశాయి.
మహబూబాబాద్ జిల్లాలో 49 శాతం అధిక వర్షపాతం నమోదైంది. తక్కువ వర్షపాతం నమోదైన జిల్లా మాత్రం ఆదిలాబాద్.అక్కడ కేవలం 11 శాతం అధిక వర్షం మాత్రమే నమోదైంది.
వివరాలు
వర్షాల దినాల సంఖ్య కూడా ఎక్కువ
రాష్ట్ర సగటున గత సంవత్సరంలో 116 రోజుల పాటు వర్షం కురిసింది.
వర్షాలు ఎక్కువ రోజులు కురిసిన జిల్లాల్లో కుమురంభీం ఆసిఫాబాద్ మొదటి స్థానంలో నిలిచింది, అక్కడ 101 రోజులు వర్షం పడింది.
ములుగు జిల్లాలో 99 రోజులు, మహబూబాబాద్లో 97 రోజులు, రాజన్న సిరిసిల్ల, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తలపొరిగా 92 రోజుల పాటు వర్షాలు నమోదయ్యాయి.
ఇక కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో 91 రోజుల పాటు వర్షం కురిసింది.