India Advisory: అత్యవసరమైతే తప్ప ఇరాన్కు వెళ్లొద్దు.. భారత పౌరులకు ఎంబసీ సూచన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం తాజా ప్రయాణ సూచనలను విడుదల చేసింది. ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు కొంత మెరుగుపడుతున్నప్పటికీ,అత్యవసర అవసరం లేకపోతే ఆ దేశానికి ప్రయాణించవద్దని భారత పౌరులకు సూచించింది. భారత ఎంబసీ ఎక్స్ వేదికగా విడుదల చేసిన ప్రకటనలో ఇరాన్లోని భద్రతా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కొన్ని సానుకూల పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ,అక్కడ నివసిస్తున్న భారతీయులు పూర్తి అప్రమత్తతతో ఉండాలని పేర్కొంది. స్థానిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు సంబంధిత అధికారులు జారీచేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే తదుపరి ప్రకటనలు వెలువడే వరకు ఇరాన్కు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఎంబసీ స్పష్టం చేసింది.
వివరాలు
హర్మూజ్, అణు కేంద్రాల అంశాల్లో కొనసాగుతున్న విభేదాలు
ఒకవేళ అనివార్య కారణాలతో ఇరాన్కు వెళ్లాల్సి వస్తే ముందుగానే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరింది. ఎంబసీ అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా ఖాతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించింది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ విరమణ ప్రక్రియ పూర్తయినప్పటికీ కొన్ని కీలక అంశాల్లో ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి నిర్వహణ, అణు కేంద్రాల తనిఖీల అంశాలు వివాదాస్పదంగా మారాయి. బాంబు దాడుల్లో దెబ్బతిన్న అణు కేంద్రాలను పరిశీలించేందుకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ఇన్స్పెక్టర్లకు అనుమతి ఇవ్వడానికి ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది.
వివరాలు
పరస్పర విరుద్ధ ప్రకటనలు
మరోవైపు హర్మూజ్ జలసంధిని మూసివేశామని టెహ్రాన్ ప్రకటిస్తుండగా, అది సాధారణంగానే తెరిచి ఉందని అమెరికా చెబుతోంది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలతో పశ్చిమాసియాలో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అన్న అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది.