BrahMos and Astra Missile Deal: ఇండోనేసియాకు బ్రహ్మోస్,అస్త్ర క్షిపణులు.. మోదీ పర్యటనలో కీలక ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా పాకిస్థాన్పై తన సామర్థ్యాన్ని చాటిన భారత సూపర్సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండోనేసియా బ్రహ్మోస్తో పాటు స్వదేశీ అస్త్ర ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల కొనుగోలుకు భారత్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ జకార్తా పర్యటనలో ఈ రక్షణ ఒప్పందం సహా పలు కీలక అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేసియాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
వివరాలు
ఇండోనేసియా రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ క్షిపణులు కీలక పాత్ర
ఈ సమావేశంలో రక్షణ, సాంకేతికత, కీలక ఖనిజాలు,ఆహార భద్రత,సముద్ర భద్రత,ఔషధ రంగం, సైనిక సహకారం తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించేలా పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా ఇండోనేసియా సైన్యానికి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను సరఫరా చేసేందుకు భారత్ అంగీకరించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇండోనేసియా రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ క్షిపణులు కీలక పాత్ర పోషించనున్నాయి. అదే సమయంలో భారత్ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అస్త్ర ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను కూడా ఇండోనేసియా దిగుమతి చేసుకోనుంది. 'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా ఈ క్షిపణుల పనితీరును పరిశీలించిన తర్వాత వాటి సామర్థ్యంపై ఆకర్షితమైన జకార్తా ప్రభుత్వం కొనుగోలుకు ముందుకొచ్చింది.
వివరాలు
స్టీల్, నికెల్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ తయారీ రంగాల్లో భారత్ పెట్టుబడులు
రక్షణ రంగంతో పాటు కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కూడా ఇరు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇండోనేసియాలో స్టీల్, నికెల్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ తయారీ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. దీంతో భవిష్యత్తులో కీలక ఖనిజాల సరఫరా గొలుసు మరింత బలపడే అవకాశం ఉంది. అలాగే మలక్కా జలసంధికి సమీపంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన సబాంగ్ పోర్ట్ అభివృద్ధిని సంయుక్తంగా చేపట్టేందుకు ఇరు దేశాలు నిర్ణయించాయి.
వివరాలు
భారత్కు సముద్ర భద్రతతో పాటు వాణిజ్యపరంగానూ కీలక ప్రయోజనాలు
ఈ పోర్టు అభివృద్ధి భారత్కు సముద్ర భద్రతతో పాటు వాణిజ్యపరంగానూ కీలక ప్రయోజనాలను అందించనుంది. ఇండోనేసియా ఎన్నికల అవసరాల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తయారీలో కూడా భారత్ సాంకేతిక సహకారం అందించేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందంతో రక్షణ, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఖనిజాలు, ఎన్నికల నిర్వహణ వంటి అనేక రంగాల్లో భారత్-ఇండోనేసియా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది.