J&K: జమ్ముకశ్మీర్లో భారీ తనిఖీలు.. 2,500 మంది నిర్బంధం, రెండు ఇళ్ల కూల్చివేత
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్లో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అషిక్ హుస్సేన్ ఖురేషీ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఘటన అనంతరం భద్రతా బలగాలు లోయ అంతటా విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని అనుమానిస్తూ 2,500 మందికిపైగా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమర్నాథ్ యాత్ర భద్రతా విధుల్లో ఉన్న సమయంలో బుధవారం జరిగిన ఈ దాడి తర్వాత చర్యలు మరింత వేగవంతమయ్యాయి. శ్రీనగర్లో 700 మందికిపైగా, బుద్గామ్ జిల్లాలో 200 మందికిపైగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే దక్షిణ కశ్మీర్లోని హసన్పోరా, బిజ్బెహారా ప్రాంతాల్లో ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న ఇద్దరి ఇళ్లను అధికారులు కూల్చివేశారు.
వివరాలు
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అభ్యంతరం
అయితే ఈ చర్యలపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇలాంటి సామూహిక నిర్బంధాలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతాయని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కూడా విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.
మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఈ చర్యలను సామూహిక శిక్షగా అభివర్ణిస్తూ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు.
ఇదిలా ఉండగా, హెడ్ కానిస్టేబుల్ హత్యలో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాది పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.