
JEE Main 2025 Results: జేఈఈ (మెయిన్) సెషన్ -2 ఫలితాలు విడుదల.. నలుగురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయస్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ మెయిన్ 2025 రెండో సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేయడంతో పాటు, విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోర్ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీలలో పేపర్ -1 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను చూసేందుకు విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ను ఉపయోగించి స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి.
వివరాలు
నలుగురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్
ఈసారి జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు గొప్ప విజయం సాధించారు. హైదరాబాద్కు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు పొందారు. బనిబ్రత మాజీ, వంగల అజయ్రెడ్డి ఇద్దరూ 300కి 300 మార్కులు సాధించడంతో, ఇద్దరికీ ఒకే ర్యాంకు కేటాయించారు. ఇతర రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన ఇద్దరు విద్యార్థులకు కూడా ఇదే ర్యాంకు వచ్చే అవకాశముంది. ఈసారి వయసు ఆధారంగా ర్యాంకుల కేటాయింపు ప్రామాణికంగా తీసుకోకపోవడంతో, సమాన మార్కులు వచ్చినవారికి ఒకే ర్యాంకు కేటాయించనున్నారు.
వివరాలు
విభాగాలవారీగా కటాఫ్ స్కోర్లు:
ఈడబ్ల్యూఎస్ విభాగంలో అజయ్రెడ్డి మొదటి ర్యాంకు సాధించారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలానికి చెందిన తాటిపాడు గ్రామం. 9వ తరగతి నుంచి హైదరాబాద్లో చదువుతున్నారు. ఈ ఏడాది జనరల్ విభాగానికి కటాఫ్ పర్సంటైల్ 93.102గా నిర్ణయించగా, గత సంవత్సరం అది 93.236గా ఉంది. మొత్తం 14.75 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. జనరల్ - 93.102 పర్సంటైల్ ఈడబ్ల్యూఎస్ - 80.383 పర్సంటైల్ ఓబీసీ - 79.431 పర్సంటైల్ ఎస్సీ - 61.15 పర్సంటైల్ ఎస్టీ - 47.90 పర్సంటైల్
వివరాలు
24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్
ఈ కటాఫ్కు సమానమైన లేదా ఎక్కువ స్కోర్ పొందినవారికే మే 18న జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయేందుకు అర్హత ఉంటుంది. ఈ రెండు సెషన్లను కలిపి మొత్తం 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి బనిబ్రత మాజీ, హర్ష్ ఎ. గుప్తా, అజయ్రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ ఈ జాబితాలో ఉన్నారు.
వివరాలు
సెషన్ 1, 2లో ఉత్తమ స్కోరుతో ర్యాంకుల కేటాయింపు
విద్యార్థులు సెషన్ 1,సెషన్ 2లో సాధించిన ఉత్తమ స్కోర్ను ఆధారంగా తీసుకొని ర్యాంకులు కేటాయించబడ్డాయి. తర్వాత సామాజిక వర్గాల ప్రకారం రిజర్వేషన్లు వర్తింపజేసి మొత్తం 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసే అర్హత కల్పిస్తారు. ఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రముఖ ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశముంటుంది. జేఈఈ అడ్వాన్స్డ్కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 23 నుండి మే 2 వరకు ఆన్లైన్లో జరుగుతుంది. మే 18న ఈ పరీక్ష నిర్వహించనున్నారు.