Page Loader
Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు.. యాత్రికుల‌కు స్వాగతం చెప్పిన సీఎం ధామి
తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు.. యాత్రికుల‌కు స్వాగతం చెప్పిన సీఎం ధామి

Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు.. యాత్రికుల‌కు స్వాగతం చెప్పిన సీఎం ధామి

వ్రాసిన వారు Sirish Praharaju
May 02, 2025
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయం ద్వారాలు శుక్రవారం ఉదయం భక్తుల కోసం తెరుచుకున్నాయి. వేద మంత్రోచ్చారణల నడుమ, ఉదయం 7 గంటల సమయంలో ఆలయం తలుపులు తెరిచారు. ఈ పవిత్ర సందర్భానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయాన్ని విభిన్న రకాల పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు కేదార్‌నాథ్‌కు తరలివచ్చారు. భక్తులపై హెలికాప్టర్ ద్వారా పుష్ప వర్షం కురిపించి ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని మరింత భక్తిశ్రద్ధలతో మేళవించారు. ఈ వేడుకల్లో బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల కమిటీ సభ్యులు, అధికారులతో పాటు పూజారులు, వేద పండితులు పాల్గొన్నారు.

వివరాలు 

సోన్ ప్రయాగ్ ప్రాంతం నుంచి హెలికాప్టర్ సేవలు

చార్ ధామ్ యాత్రలో భాగంగా ఇటీవల అక్షయ తృతీయ సందర్భంలో ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచారు. ఇక మిగిలిన బద్రీనాథ్ ఆలయం మాత్రం మే 4న భక్తులకు దర్శనార్థం అందుబాటులోకి రానుంది. కేదార్‌నాథ్ యాత్ర కోసం సోన్ ప్రయాగ్ ప్రాంతం నుంచి హెలికాప్టర్ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేదార్‌నాథ్‌కు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులతో కలిసి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. భద్రతా పరంగా జమ్మూకశ్మీర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడిని దృష్టిలో ఉంచుకుని, కేదార్‌నాథ్ పరిసర ప్రాంతాలతో పాటు పలు కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా దళాలను భారీగా మోహరించారు.

వివరాలు 

మే 4న బద్రీనాథ్ ఆలయం

ఈ నేపథ్యంలో కేదార్‌నాథ్ ఆలయం తలుపులు తెరుచుకోవడంతో చార్‌ధామ్ యాత్ర ఓ విధంగా ప్రారంభమైనట్టే అయింది. మే 4న బద్రీనాథ్ ఆలయం కూడా తెరుచుకుంటే, ఈ యాత్రలో పాల్గొనదలచిన లక్షలాది మంది భక్తులు త్వరలో ఉత్తరాఖండ్‌కి తరలిరావడంతో యాత్ర మరింత ఉత్సాహంగా సాగనుంది.