Madras Regiment: మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు ఆర్మీ అధికారులు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చోరీకి గురైన ఆయుధాలు, మ్యాగజైన్స్, బుల్లెట్స్, బైనాక్యులర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఆర్మీ విశ్రాంత అధికారితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయుధాల చోరీపై గత కొన్ని రోజులుగా బొల్లారం, మల్కాజిగిరి పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో చోరీకి గురైన ఆయుధాలను మహబూబ్నగర్లో నివసిస్తున్న ఓ విశ్రాంత ఆర్మీ అధికారి ఇంట్లో టాస్క్ఫోర్స్ పోలీసులు నిన్న రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
వివరాలు
ఇద్దరు ఇన్ఛార్జిల సహకారంతోనే చోరీలు?
మద్రాస్ రెజిమెంట్లో ఆయుధాలను భద్రపరిచే ప్రాంతాన్ని 'కోటె'గా పిలుస్తారు. అక్కడ బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్ఛార్జి, బుల్లెట్స్ జారీ చేసే ఆమ్నిషన్ సెక్షన్ ఇన్ఛార్జి విధులు నిర్వహిస్తారు.
వీరిద్దరి సహకారంతోనే విశ్రాంత ఆర్మీ అధికారి వీలు చిక్కినప్పుడల్లా ఆయుధాలను చోరీ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే, ఈ వ్యవహారంపై పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
మల్కాజిగిరి సీపీ.. ఆర్మీ అధికారులతో కలిసి ఇవాళ సాయంత్రం లేదా రేపు మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.