Loading...
NEET-UG 2026 Leak: రూ.5 లక్షలకు.. నీట్‌లో 111 ప్రశ్నలు లీక్‌.. అసలు పేపర్‌తో సరిపోలినట్లు సీబీఐ వెల్లడి
అసలు పేపర్‌తో సరిపోలినట్లు సీబీఐ వెల్లడి

NEET-UG 2026 Leak: రూ.5 లక్షలకు.. నీట్‌లో 111 ప్రశ్నలు లీక్‌.. అసలు పేపర్‌తో సరిపోలినట్లు సీబీఐ వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2026
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. రసాయన శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నపత్రాల సెట్లలోని 111 ప్రశ్నలను రూ.5 లక్షలకు విక్రయించినట్లు ఆధారాలు లభించాయని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. కేసు దర్యాప్తు పురోగతిపై సమర్పించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఈ కేసులో నిందితుడైన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్ రఘునాథ్ మోటేగావ్‌కర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీబీఐ కోర్టుకు సమర్పించిన నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన శివరాజ్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)ప్రశ్నపత్రాల రూపకల్పన కమిటీలో సభ్యుడిగా పనిచేసిన పీవీ కులకర్ణి నుంచి నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలను సేకరించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది.

వివరాలు 

శివరాజ్ మొబైల్ ఫోన్‌లో 36 ఫొటోలు

అలాగే, కులకర్ణి నిర్వహించిన కోచింగ్ తరగతులకు శివరాజ్ కుమారుడు హాజరైనట్లు కూడా నివేదికలో వివరించింది.

దర్యాప్తులో భాగంగా శివరాజ్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, అందులో 36 ఫొటోలు లభించినట్లు సీబీఐ వెల్లడించింది.

ఆ ఫొటోల్లో చేతితో రాసిన 132 రసాయన శాస్త్ర ప్రశ్నలు ఉండగా, వాటిలో 111 ప్రశ్నలు నీట్-యూజీ 2026 మాస్టర్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో పూర్తిగా సరిపోలినట్లు గుర్తించినట్లు తెలిపింది.

అంతేకాక, రసాయన శాస్త్ర ప్రశ్నలకు సంబంధించిన చేతిరాత నోట్స్ నిందితుడే రాసి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు సీబీఐ కోర్టుకు తెలియజేసింది.

అలాగే, ఈ ప్రశ్నల ఫొటోలు మే 3న జరిగిన నీట్ పరీక్షకు సుమారు పది రోజుల ముందే తీసినట్లు దర్యాప్తులో తేలినట్లు పేర్కొంది.

వివరాలు 

పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 13 మంది అరెస్టు

ఈ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేసినట్లు, వారంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు సీబీఐ వెల్లడించింది.

పేపర్ లీక్ ఆరోపణలు వెలుగులోకి రావడంతో మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను అధికారులు రద్దు చేశారు.

అనంతరం జూన్ 21న విద్యార్థుల కోసం మళ్లీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT