Page Loader
Indian railway: అధిక ధర గురించి ఫిర్యాదు.. ప్రయాణికుడిపై క్యాటరింగ్‌ సిబ్బంది దాడి(వీడియో)
అధిక ధర గురించి ఫిర్యాదు చేసినందుకు.. ప్రయాణికుడిపై క్యాటరింగ్‌ సిబ్బంది దాడి(వీడియో)

Indian railway: అధిక ధర గురించి ఫిర్యాదు.. ప్రయాణికుడిపై క్యాటరింగ్‌ సిబ్బంది దాడి(వీడియో)

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైళ్లలో, రైల్వే స్టేషన్లలో అమ్మే పానీయాలు, ఆహార పదార్థాలను ఎల్లప్పుడు ఎమ్‌ఆర్‌పీ ధరలకే విక్రయించాలి. అయితే, కొందరు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ధరలు వసూలు చేస్తున్నారు. అలాంటి ఒక ఘటన మే 7న హేమకుంత్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. ఓ ప్రయాణికుడు వాటర్ బాటిల్‌ను అధిక ధరకు విక్రయించారని ఫిర్యాదు చేయగా, క్యాటరింగ్ సిబ్బంది అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ తక్షణమే స్పందించి చర్యలు ప్రారంభించింది.

వివరాలు 

యూట్యూబ్ ఛానెల్‌ 'మిస్టర్ విశాల్'లో అప్‌లోడ్

హేమకుంత్ ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న యూట్యూబర్ విశాల్, తన ప్రయాణ సమయంలో ఓ వాటర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. అయితే బాటిల్‌ను ఎమ్‌ఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించారని గమనించి, ఆయన 'రైల్ మదద్' యాప్ ద్వారా రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న క్యాటరింగ్ సిబ్బంది గుంపుగా వచ్చి అతడి సీటు వద్దకు చేరుకొని, అతనితో దురుసుగా ప్రవర్తించారు. పై బెర్త్‌లో ఉన్న విశాల్‌ను కిందకు దిగాలని ఒత్తిడి చేస్తూ మాటల యుద్ధానికి దిగారు. చివరికి అతనిపై శారీరకంగా దాడికి పాల్పడ్డారు. ఈ మొత్తం ఘటనను విశాల్ తన మొబైల్‌లో వీడియో రూపంలో చిత్రీకరించి, తన యూట్యూబ్ ఛానెల్‌ 'మిస్టర్ విశాల్'లో అప్‌లోడ్ చేశాడు.

వివరాలు 

క్యాటరింగ్ సంస్థపై రూ. 5 లక్షల జరిమానా

అనంతరం ఈ వీడియోను 'స్కిన్ డాక్టర్' అనే మరో ఎక్స్ (మునుపటి ట్విట్టర్) హ్యాండిల్‌ రీపోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో రైల్వే శాఖ స్పందించింది. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు రైల్వే శాఖ తన ఎక్స్‌ అకౌంట్‌లో తెలిపింది. ఫిర్యాదులో పేర్కొన్న క్యాటరింగ్ సంస్థపై రూ. 5 లక్షల జరిమానా విధించినట్లు తెలిపింది. అలాగే, దాడికి పాల్పడిన వ్యక్తులపై కథువా జీఆర్‌పీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

వివరాలు 

రైల్వే శాఖ వేగంగా స్పందించడంపై నెటిజన్లు ప్రశంసలు 

ఈ ఘటనపై రైల్వే శాఖ వేగంగా స్పందించడాన్ని కొంతమంది నెటిజన్లు ప్రశంసించారు. అయితే, ఇంకొందరు ప్రయాణికులు భయంతో ఫిర్యాదు చేయకుండా వెనకాడే పరిస్థితి రాకుండా ఉండాలంటే మరింత కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..