Manmohasingh: మన్మోహన్ సింగ్ కు ముగిసిన రాజ్యసభ పదవీకాలం...హీరోగా మిగిలిపోయారన్న మల్లికార్జునఖర్గే
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసిందని ఎక్స్ లో పోస్ట్ చేస్తూ దానికింద ''సింగ్ రిటైర్మైంట్తో ఒక శకం ముగిసింది"అని కామెంట్ చేశారు. మధ్యతరగతి వర్గానికి, యువతకు మన్మోహన్ సింగ్ హీరోగా మిగిలిపోయారని కొనియాడారు. ఇంకా ఎక్స్ లో మన్మోహన్ సింగ్ గురించి ఖర్గే లేఖ రాశారు. క్రియాశీలక రాజకీయాలనుంచి మీరు రిటైరైనప్పటికీ ప్రజలతో మీరు మాట్లాడటం ద్వారా మీ తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు ఈ జాతియావత్తుకు మీ వాణి కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. 33 ఏళ్ల మీ రాజకీయ ప్రస్థానం నేటితో ముగిసింది.
పారిశ్రామిక వేత్తలకు మీరొక గైడ్...
శాంతి, సంతోషం, మంచి ఆరోగ్యాన్ని మీకు భగవంతుడు కలగజేయాలి. ''చాలా కొద్దిమంది మాత్రమే అంకితభావంతో మరింత భక్తి శ్రద్ధలతో ఈ దేశానికి సేవచేయగలమని చెప్పగలరు. చాలా కొద్దిమంది మాత్రమే ఈ దేశం కోసం, దేశ ప్రజలకోసం వాటిని ఆచరణలో పెట్టి పూర్తి చేయగలుగుతారు. అందులో మీరు కూడా ఒకరు. దేశంలో మీరు అనుసరించిన ఆర్థిక విధానాల వల్లే చాలామంది పేదలు తమ పేదరికం నుంచి గట్టెక్కగలిగారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, పారిశ్రామిక వేత్తలకు మీరొక గైడ్. మధ్యతరగతి వర్గానికి మీరెప్పుడూ ఒక హీరో. మీ ఆర్థిక విధానాలతో పరిశ్రమలు, యువ పారిశ్రామిక వేత్తలు, పేదలు ఇలా అన్ని వర్గాలు సమానంగా లబ్ది పొందాయి. చివరికి పేద ప్రజలను కూడా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయగలిగారు.