
Blast : పటాన్చెరులో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికుల మృతి
ఈ వార్తాకథనం ఏంటి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడి సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ అకస్మాత్తుగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. పేలుడు సమయంలో అనేక మంది కార్మికులు తమ పనుల్లో ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
Details
గాల్లోకి ఎగిరిన శరీరాలు
పేలుడు అనంతరం ఫ్యాక్టరీ పరిధిలో తీవ్ర మంటలు చెలరేగాయి. దాని ప్రభావంతో కార్మికులు గాల్లోకి ఎగిరిపడి, శరీర భాగాలు సుమారు 100 మీటర్ల దూరం వరకు చెల్లాచెదురయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పరిశ్రమ చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. శబ్దం దూరం వరకూ వినిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
Details
ఐదుగురు మృతి, పలువురి పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు కార్మికులు మృతి చెందారు. మరో 20 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. మంటలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గాయపడినవారిని అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడానికి శ్రమిస్తున్నాయి. పరిశ్రమ వద్దకు పెద్ద సంఖ్యలో స్థానికులు, సహచర కార్మికులు చేరడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.