Loading...
NEET UG: నేటి నుంచి నీట్‌ యూజీ ఆల్‌ ఇండియా ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ 
నేటి నుంచి నీట్‌ యూజీ ఆల్‌ ఇండియా ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్

NEET UG: నేటి నుంచి నీట్‌ యూజీ ఆల్‌ ఇండియా ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2026
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

నీట్‌ యూజీ ద్వారా ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు సంబంధించిన ఆల్‌ ఇండియా కోటా (AIQ) కౌన్సెలింగ్‌ మంగళవారం (ఆగస్టు 5) నుంచి ప్రారంభమవుతోందని విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా మంది నీట్‌ యూజీ పరీక్ష రాయగా,వారిలో సుమారు 11 లక్షల మంది అర్హత సాధించినట్లు వెల్లడించారు. విజయవాడలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుందని చెప్పారు.

వివరాలు 

అభ్యర్థులు ఒకేసారి ఆప్షన్లు నమోదు చేసుకోవాలి 

జాతీయ వైద్య మండలి (NMC) మార్గదర్శకాల ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు సెప్టెంబరు 8 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రారంభమవుతాయని వివరించారు.

విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సాయిసుధీర్‌ మాట్లాడుతూ.. 2020లో కళాశాలల ఎంపిక కోసం జీవో 151 జారీ చేసి, అభ్యర్థులు ఒకేసారి ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొన్నట్లు గుర్తు చేశారు.

అయితే గత ఏడాది ఈ నిబంధనపై కొంతమంది విద్యార్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు.

ఈ కేసులో అభ్యర్థి తనకు నచ్చిన కళాశాలను ఎంచుకునే స్వేచ్ఛతో పాటు, నచ్చని కళాశాలను వదిలివేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసినట్లు చెప్పారు.

వివరాలు 

రిజర్వేషన్‌ అభ్యర్థుల స్లైడింగ్‌ ప్రక్రియపై కూడా అధికారులు వివరణ

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న జీవో 102ను జారీ చేసిందని ఆయన వెల్లడించారు.

ఈ మార్పుతో మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు రాని అభ్యర్థులు రెండో, మూడో విడత కౌన్సెలింగ్‌లలో కూడా కొత్తగా ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

ఈ విషయంలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విద్యార్థులకు సూచించారు.

రిజర్వేషన్‌ అభ్యర్థుల స్లైడింగ్‌ ప్రక్రియపై కూడా అధికారులు వివరణ ఇచ్చారు.

ప్రతిభ ఆధారంగా ఓపెన్‌ కేటగిరీలో ఒక కళాశాలలో సీటు పొందిన రిజర్వేషన్‌ అభ్యర్థికి, తర్వాత దశలో తన రిజర్వేషన్‌ కేటగిరీలో మరింత మెరుగైన కళాశాలలో సీటు లభిస్తే, ఆ సీటుకు స్లైడింగ్‌ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

ఈ ఏడాది 325 ఎంబీబీఎస్‌ సీట్లు అదనం

దీంతో ఖాళీ అయ్యే సీటును అదే రిజర్వేషన్‌ కేటగిరీలోని తదుపరి అర్హుడైన అభ్యర్థికి కేటాయిస్తారని చెప్పారు.

ఆ కేటగిరీలో అర్హులెవరూ లేకపోతే ఆ సీటును ఓపెన్‌ కేటగిరీగా పరిగణించే నిబంధన అమల్లో ఉందని వివరించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో గత విద్యా సంవత్సరంలో మొత్తం 6,940 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా, ఈ ఏడాది అదనంగా 325 సీట్లకు జాతీయ వైద్య మండలి అనుమతి ఇచ్చింది.

విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లకు అదనంగా మరో 75 ఎంబీబీఎస్‌ సీట్లు మంజూరయ్యాయి.

దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన వెంటనే సవరించిన సీట్ల వివరాలతో కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

ADVERTISEMENT