Telangana: జులై 15 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూపొందించిన ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను జులై 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను వారం రోజుల్లో ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల హెల్త్కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) తొలి సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోందని ప్రధాన కార్యదర్శి తెలిపారు.
వివరాలు
514 ఆస్పత్రులలో పథకం అమలు..
గతంలో చికిత్స ఖర్చుల కింద గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మాత్రమే ఆర్థిక సహాయం అందించేవారని, ప్రస్తుతం ఒక్కో చికిత్సకు కనీసం రూ.5 లక్షల వరకు చెల్లించే విధంగా పరిమితిని పెంచాలని వారు కోరారు. అలాగే క్యాన్సర్కు సంబంధించిన కొత్త రకాల వ్యాధులను కూడా ఈ పథకంలో చేర్చాలని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ఈ పథకం పరిధిలో 1,885 రకాల వ్యాధులకు చికిత్స అందించే అవకాశం ఉండగా, 514 ఆసుపత్రుల్లో అమలులో ఉంది. ఈసారి వ్యాధుల సంఖ్యతో పాటు గుర్తింపు పొందిన ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచాలని పలువురు సంఘాల నాయకులు కోరారు.