Launches Rs.5 Meal: దిల్లీలో కొత్త పథకం.. కేవలం రూ.5కే భోజనం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో నివసిస్తున్న పేదలకు రోజువారీ ఆహార సరఫరా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. రోజంతా కష్టపడినా, చాలామంది పేదలు ప్రతి రోజు పోషకాహారంతో కూడిన భోజనం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆహారం కోసం ఖర్చు చేయాల్సి రావడంతో, ఇతర మౌలిక అవసరాలను వదలుకోవాల్సి వస్తోంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, ఎవరూ ఆకలితో బాధపడకూడదనే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం కేవలం రూ.5కే భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని అటల్ క్యాంటీన్ అనే పేరుతో ఏర్పాటు చేసి దిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రారంభించారు.
Details
పోషకాహారాన్ని అందిచడమే ప్రభుత్వ లక్ష్యం
తక్కువ ధరలో శుభ్రమైన, పోషకాహార భోజనం అందించడమే ఈ పథక ఉద్దేశ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా, 100 అటల్ క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు ఢిల్లీ పట్టణాభివృద్ధి మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు. ఈ క్యాంటీన్లలో కేవలం రూ.5కే భోజనం అందించబడుతుందని ఆయన వివరించారు. గురువారం నుండి ఈ 100 అటల్ క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. అటల్ క్యాంటీన్ మెనూలో అన్నం, పప్పులు, కూరగాయలు, బ్రెడ్ వంటి పోషకాహార పదార్థాలు ఉండనున్నాయి. ఈ పథకం ద్వారా పేదలు, కార్మికులు, రోజువారీ వేతన జీవులు లబ్ధి పొందుతారని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.