UN Map: ఐరాస మ్యాప్లో ప్రత్యేక ప్రాంతాలుగా అరుణాచల్, అక్సాయ్చిన్.. భారత్ వైఖరి ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
ఐరాస కొత్త ప్రపంచ పటం మరోసారి చర్చకు తెరలేపింది. ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన ఈ మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్చిన్లను భారత్, చైనా మధ్య వివాదంలో ఉన్న సరిహద్దుల మధ్య ప్రత్యేక ప్రాంతాలుగా చూపించారు. అక్సాయ్చిన్ను లడఖ్లో భాగంగా భారత్ పేర్కొంటున్న విషయం తెలిసిందే. 'కరెక్ట్ ది మ్యాప్' తీర్మానంపై ఐరాస సర్వసభ్య సమావేశంలో చర్చలు జరుగుతున్న సమయంలో.. జులై 1న ఈ ప్రపంచ పటాన్ని తొలిసారిగా విడుదల చేశారు. ఇందులో అరుణాచల్ప్రదేశ్-నాగాలాండ్ మధ్య ఉన్న సరిహద్దును చూపించలేదు. అరుణాచల్ప్రదేశ్ను ప్రత్యేక రాష్ట్రంగా పేర్కొంటూ.. దాని పశ్చిమాన అసోం, ఉత్తరాన చైనా సరిహద్దులు ఉన్నట్లు మ్యాప్లో చిత్రించారు.
వివరాలు
అక్సాయ్చిన్ కూడా ప్రత్యేక ప్రాంతంగానే..
అక్సాయ్చిన్ను సైతం ఐరాస కొత్త మ్యాప్లో ప్రత్యేక ప్రాంతంగా చూపించారు.
ఈ ప్రాంతానికి పశ్చిమ దిశలో భారత్, తూర్పున చైనా సరిహద్దులు ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే ఈ విధంగా సరిహద్దులను ఎందుకు చిత్రించారనే అంశంపై ఐక్యరాజ్యసమితి ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
వివరాలు
జమ్మూ కశ్మీర్ ఎల్ఓసీని చుక్కల రేఖతో..
జమ్ముకశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ను కూడా ఐరాస మ్యాప్లో చుక్కల రేఖతో సూచించారు.
దీనికి సంబంధించి పటం కింది భాగంలో ఐరాస వివరణ ఇచ్చింది. భారత్, పాకిస్థాన్ అంగీకరించిన జమ్మూ కశ్మీర్ ఎల్ఓసీని ఈ చుక్కల రేఖ సుమారుగా సూచిస్తుందని తెలిపింది.
అయితే జమ్మూ కశ్మీర్ తుది స్థితిపై సంబంధిత పక్షాల మధ్య ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదని ఐరాస పేర్కొంది.
వివరాలు
'కరెక్ట్ ది మ్యాప్' తీర్మానం ఏంటి?
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను పటాల్లో మరింత కచ్చితంగా, సమానత్వాన్ని ప్రతిబింబించేలా చూపించాలనే ఉద్దేశంతో 'కరెక్ట్ ది మ్యాప్' తీర్మానాన్ని తీసుకొచ్చారు.
ఆఫ్రికన్ యూనియన్ మద్దతుతో ఆఫ్రికా గ్రూప్ తరఫున టోగో ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లింది.
ఐరాస సర్వసభ్య సమావేశం గత వారం దీనికి ఆమోదం తెలిపింది.
ముఖ్యంగా ఆఫ్రికా ప్రాంతాల భౌగోళిక చిత్రణను మరింత సమానంగా, వాస్తవికంగా చూపించడమే ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశం.
అయితే ఇది చట్టబద్ధంగా అమలు చేయాల్సిన తీర్మానం కాదు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బహుళపక్ష సంస్థలు ఉపయోగించే ప్రామాణిక ప్రపంచ పటాల్లో ఈ సూత్రాలకు అనుగుణంగా మార్పులు జరిగే అవకాశం ఉంది.
వివరాలు
తీర్మానానికి భారత్ మద్దతు.. కానీ..
'కరెక్ట్ ది మ్యాప్' తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది.సమాన విస్తీర్ణాన్ని ప్రతిబింబించే విధంగా ప్రపంచ పటాలను రూపొందించాలనే ప్రాథమిక సూత్రానికి మద్దతుగా తాము ఓటు వేసినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
అయితే ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వడాన్ని ఏదైనా నిర్దిష్ట ప్రపంచ పటం, మ్యాప్ ప్రొజెక్షన్ లేదా దేశాల సరిహద్దుల ప్రత్యేక చిత్రణకు ఆమోదంగా పరిగణించరాదని స్పష్టం చేసింది.
భారత భూభాగాన్ని అధికారిక పటం ప్రకారమే చూపాలి..
జమ్మూ కశ్మీర్,లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు సహా భారత సార్వభౌమ భూభాగాన్ని అధికారిక భారత మ్యాప్లో ఉన్న విధంగానే చూపించాలని కేంద్రం తేల్చిచెప్పింది.
తప్పుడు,తప్పుదోవ పట్టించే లేదా భారత భూభాగంపై అపోహలు కలిగించే చిత్రణను తాము అంగీకరించబోమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.