BJP: వందేమాతరం విషయంలో రాజీ లేదు.. కాంగ్రెస్ నిర్ణయాన్ని ఖండించిన బీజేపీ
ఈ వార్తాకథనం ఏంటి
'వందేమాతరం'లోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ గేయం గౌరవం విషయంలో ఎలాంటి రాజీకి అంగీకరించబోమని స్పష్టం చేసింది. వందేమాతరం ఘన వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన తొలిసారి సమావేశమైన నూతన జాతీయ కార్యవర్గం ఈ మేరకు తీర్మానం చేసింది.
వివరాలు
'పూర్ణ వందేమాతరం' గౌరవాన్ని కాపాడతాం
వందేమాతరం గౌరవం, చారిత్రక వారసత్వ పరిరక్షణకు సంబంధించిన తీర్మానాన్ని జాతీయ కార్యవర్గం ఆమోదించిందని నితిన్ నబీన్ తెలిపారు.
ఈ గేయం విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు విధానాలను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
ఆరు చరణాలతో కూడిన పూర్తి వందేమాతరం చరిత్ర, అర్థం, జాతీయ ప్రాముఖ్యాన్ని ప్రచార కార్యక్రమాల ద్వారా యువతకు వివరిస్తామని నబీన్ తెలిపారు.
'పూర్ణ వందేమాతరం' గౌరవాన్ని కాపాడతామని పేర్కొన్నారు.
వందేమాతరాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదంగా మహాత్మా గాంధీ పేర్కొన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.