Uttam Kumar Reddy: ఎవరినీ వదిలిపెట్టం: కాళేశ్వరం బ్యారేజీ పిల్లర్ల కుంగిపోడవంపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని నిర్మించిన ఎల్అండ్టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. ఈ బ్యారేజీలపై సమావేశంలో మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా ఎల్అండ్టి చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరంను నాసిరకంగా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. నాసిరకం నిర్మాణంపై ఏదో ఒక లేఖ ఇచ్చి బాధ్యత నుంచి తప్పించుకోలేరని ఎల్అండ్టీ ప్రతినిధులను ఆయన హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు.