Page Loader
Chirag Paswan: అనవసరపు చర్చ వద్దు.. వీధుల్లో నమాజ్ పై కేంద్రమంత్రి స్పందన
అనవసరపు చర్చ వద్దు.. వీధుల్లో నమాజ్ పై కేంద్రమంత్రి స్పందన

Chirag Paswan: అనవసరపు చర్చ వద్దు.. వీధుల్లో నమాజ్ పై కేంద్రమంత్రి స్పందన

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

వీధుల్లో నమాజ్ చేయడంపై కేంద్రమంత్రి, ఎన్డీఏ మిత్రపక్ష నేత చిరాగ్ పాశ్వాన్ స్పందించారు. ఇటీవల యూపీ పోలీసులు వీధుల్లో నమాజ్ చేస్తే పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేయగా, ఈ ఆదేశాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రిని విలేకర్లు ప్రశ్నించగా, ఇది 'పనికిరాని చర్చ' అంటూ ఆయన తోసిపుచ్చారు. దేశంలో చర్చించాల్సిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. అనేక ప్రధాన సమస్యలు ఉండగా, దీనిపై చర్చ అవసరమా అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా వీధుల్లో నమాజ్ చేస్తుండగా, ఇప్పుడు దీనిపై చర్చ ఎందుకు తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు.

Details

అసంబద్ధమైన చర్చలు సమాజానికి హానికరం

చర్చ అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టడం వల్ల సమాజంలో ఉద్రిక్తత పెరుగుతుందని చిరాగ్ పాశ్వాన్ అభిప్రాయపడ్డారు. ఏ కారణం లేకుండానే సంఘాలు, ప్రజల మధ్య చీలికలు రావచ్చు. అందుకే ఇలాంటి చర్చలు అర్థరహితంఅని స్పష్టం చేశారు. కేంద్రమంత్రిగా తన పనితీరును ప్రశ్నించవచ్చు, కానీ మతపరమైన అంశాలపై మాట్లాడడం వల్ల అపార్థాలు మాత్రమే ఏర్పడతాయని అన్నారు.

Details

వ్యక్తిగత విశ్వాసం - ప్రతి ఒక్కరికి హక్కే

బీజేపీలోని కొంత మంది వీధుల్లో నమాజ్ చేయడాన్ని వ్యతిరేకించినప్పటికీ, తన వ్యక్తిగత అభిప్రాయం భిన్నమని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. తాను 21వ శతాబ్దానికి చెందిన విద్యావంతుడిని. మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం భావ్యం కాదని భావిస్తున్నానని అన్నారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్నా, మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని స్పష్టం చేశారు. తాను కూడా ఇఫ్తార్ విందుకు హాజరైనప్పుడు తిలకం పెట్టుకున్నానని, అది తన వ్యక్తిగత విశ్వాసమన్నారు. అదే విధంగా, ఇతరుల మత విశ్వాసాన్ని గౌరవిస్తూనే, తన మత విశ్వాసాన్ని మరిచిపోనని ఆయన స్పష్టం చేశారు. హిందూ-ముస్లింల గురించి మాట్లాడటం కంటే, దేశంలో పరిష్కరించాల్సిన అనేక సమస్యలు ఉన్నాయి. వాటిపై చర్చిస్తే మంచిదని హితవు పలికారు.