Loading...
Andhra Pradesh: ఉల్లి ధరలకు కళ్లెం.. రూ.32కే కిలో ఉల్లి.. మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడి
ఉల్లి ధరలకు కళ్లెం.. రూ.32కే కిలో ఉల్లి.. మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడి

Andhra Pradesh: ఉల్లి ధరలకు కళ్లెం.. రూ.32కే కిలో ఉల్లి.. మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 115 రైతు బజార్లు, మొబైల్‌ కౌంటర్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.32కే రాయితీ ధరకు విక్రయించనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రెండు రోజుల దిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలను మంత్రి మంగళవారం ఏపీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

వివరాలు 

మార్కెట్‌ ధరలతో పోలిస్తే 25 నుంచి 30 శాతం తక్కువ ధరకే అందుబాటులోకి..

కేంద్ర పౌరసరఫరాలశాఖ, ఎన్‌సీసీఎఫ్‌ అధికారులతో దిల్లీలో సమావేశమైనట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్రానికి ఉల్లి, కందిపప్పు, పామాయిల్‌ను రాయితీ ధరలకు సరఫరా చేయాలని వారిని కోరినట్లు చెప్పారు.

దీనిపై కేంద్ర అధికారులు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

కేంద్రం నుంచి 1.20 లక్షల టన్నుల కందులు, 86,400 కిలోలీటర్ల పామాయిల్‌ను రాష్ట్రానికి కేటాయించేందుకు అంగీకారం లభించిందన్నారు.

మార్కెట్‌ ధరలతో పోలిస్తే వీటిని 25 నుంచి 30 శాతం తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

ప్రతి కార్డుదారుడికి కిలో కందిపప్పు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

వివరాలు 

మీమార్టుల్లో 64 రకాల సరకులు

వినియోగదారులకు నిత్యావసర సరకులను తక్కువ ధరలకు అందించేందుకు ఏర్పాటు చేస్తున్న 1,000 మీమార్టులను ఎన్‌సీసీఎఫ్‌తో అనుసంధానం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

మార్కెట్‌లో లభించే ధరల కంటే తక్కువ ధరకే దాదాపు 64 రకాల సరకులను ఈ మీమార్టుల్లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.

అక్టోబర్‌ 1 నాటికి మీమార్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన నిత్యావసర సరకులను అందుబాటులోకి తీసుకురావడమే మీమార్టుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ADVERTISEMENT