MEA data: గల్ఫ్లో భారతీయుల వరుస మరణాలు.. మూడేళ్లలో 1,300కుపైగా ఆత్మహత్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉపాధి కోసం స్వగ్రామాన్ని, కుటుంబ సభ్యులను విడిచి విదేశాలకు వెళ్లే భారతీయుల్లో పలువురు అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు ప్రమాదాలు, నేర ఘటనలకు బలవుతుండగా.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పార్లమెంట్కు సమర్పించిన వివరాల ప్రకారం.. 2023 నుంచి 2025 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 39 వేల మందికిపైగా భారతీయులు వివిధ కారణాలతో మరణించారు.
వివరాలు
గల్ఫ్లోనే 70 శాతానికి పైగా ఆత్మహత్యలు
2023-2025 మధ్య విదేశాల్లో మొత్తం 1,900 మందికిపైగా భారతీయులు ఆత్మహత్య చేసుకున్నారు.
వీరిలో 70 శాతానికి పైగా, అంటే 1,340 మంది గల్ఫ్ దేశాల్లోనే బలవన్మరణాలకు పాల్పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
దేశాల వారీగా పరిశీలిస్తే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అత్యధికంగా 511 ఆత్మహత్యలు నమోదయ్యాయి.
అనంతరం సౌదీ అరేబియాలో 354, కువైట్లో 162, ఒమన్లో 146, బహ్రెయిన్లో 101, ఖతార్లో 66 మంది భారతీయులు ఆత్మహత్య చేసుకున్నారు.
గల్ఫ్ దేశాల తర్వాత మలేసియాలో 131 ఆత్మహత్యలు నమోదయ్యాయి.
అమెరికాలో 62 మంది భారతీయులు బలవన్మరణానికి పాల్పడగా.. ఇటలీ, కెనడా, యునైటెడ్ కింగ్డమ్లలో చెరో 30 కేసులు నమోదయ్యాయి.
వివరాలు
పని ప్రదేశాల ప్రమాదాల్లో 800 మందికిపైగా మృతి
విదేశాల్లో పని ప్రదేశాల్లో జరిగిన ప్రమాదాల్లో 2023-2025 మధ్య 800 మందికిపైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
వీరిలో సగానికి పైగా గల్ఫ్ దేశాల్లోనే మరణించారు. గత మూడేళ్ల సగటు ప్రకారం.. గల్ఫ్లో ప్రతి వారం ముగ్గురు భారతీయ కార్మికులు పని ప్రదేశాల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
దేశాల వారీగా చూస్తే.. సౌదీ అరేబియాలో అత్యధికంగా 182 ప్రమాద మరణాలు నమోదయ్యాయి.
యూఏఈలో 128 మంది, కువైట్లో 62 మంది, ఒమన్లో 38 మంది, ఖతార్లో 23 మంది, బహ్రెయిన్లో 10 మంది భారతీయులు పని ప్రదేశాల్లో జరిగిన ప్రమాదాల్లో మరణించారు.
వివరాలు
సహజ,ఇతర కారణాలతో వేలాది మరణాలు
గల్ఫ్ దేశాల్లో ఇదే కాలంలో సహజ కారణాలతో సుమారు 16 వేల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
అదనంగా ఇతర కారణాల వల్ల మరో 2,700 మందికిపైగా మరణించినట్లు విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడించాయి.
వివరాలు
పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
విదేశాల్లో భారతీయుల మరణాలకు సంబంధించిన ప్రశ్నలను కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తగా.. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ వివరాలను వెల్లడించారు.
గతంతో పోలిస్తే ఇటీవల విదేశాల్లో భారతీయుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్నట్లు ఆయన తెలిపారు.
అయితే, ఈ పెరుగుదలకు దారితీసిన కారణాలపై మాత్రం వివరాలు వెల్లడించలేదు.
విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.
అలాగే ప్రవాసీ భారతీయ బీమా యోజన కింద అర్హులైన భారతీయులకు బీమా సౌకర్యం అందిస్తున్నట్లు వివరించారు.