Page Loader
BSF Jawan: బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాకిస్థాన్
బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాకిస్థాన్

BSF Jawan: బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాకిస్థాన్

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2025
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాక్‌ రేంజర్లు గత నెలలో ఫిరోజ్‌పుర్‌ వద్ద బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పూర్ణమ్‌ సాహూను అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు,పూర్ణమ్‌ను నేటి ఉదయం పంజాబ్‌లోని అటారీ సరిహద్దు వద్ద మన దేశం భద్రతా దళాలకు అప్పగించినట్లు ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. దీనిని బీఎస్‌ఎఫ్‌ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.పూర్ణమ్‌ సాహూ బీఎస్‌ఎఫ్‌ 182వ బెటాలియన్‌లో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతను తన విధుల్ని పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ సెక్టార్‌లో చేస్తూ,ఏప్రిల్ 23న సరిహద్దు వద్ద కొంతమంది రైతులకు రక్షణ కల్పిస్తూ గస్తీ కాస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన సమీపంలో ఒక చెట్టు కనిపించినప్పుడు, దాని కింద విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే,అది పాక్‌ భూభాగం అని గుర్తించలేకపోయాడు.సరిహద్దును దాటి రావడంతో,పాక్‌ రేంజర్స్‌ ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.

వివరాలు 

విడుదలకు జాప్యం చేసిన పాక్‌ రేంజర్లు

జవాను విడుదల చేయడానికి రెండు దేశాల భద్రతా దళాలు చర్చలు జరిపాయి. పూర్ణమ్‌ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.గర్భిణీ అయిన ఆయన భార్య, భర్తను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ,పాక్‌ రేంజర్లు చాలా కాలం పాటు భారత్‌ అధికారుల అభ్యర్థనలను పట్టించుకోకుండా,కాలయాపన చేశారు. పాక్‌ రేంజర్లు,పై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదని చెప్పి జాప్యం చేశారు. ఈ నెల మొదటి వారంలో, భారత సరిహద్దు దళాలు కూడా పాక్‌ రేంజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ సమీపంలో భారత-పాక్‌ సరిహద్దులో ఓ పాక్‌ రేంజర్‌ అనుమానాస్పదంగా చొరబడినట్లు కనిపించాడు. ఈ ఘటనకు కారణంగా, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అతడిని పట్టుకున్నారు. ఈ పరిస్థితి, పూర్ణమ్‌ విడుదలకు సంబంధించి ఒత్తిడి పెరిగింది.