Pm Modi: 2027 SCO సదస్సుకు పాక్ నుంచి ప్రధాని మోదీకి ఆహ్వానం.. వెళ్తారా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇస్లామాబాద్లో 2027లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం పంపనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. SCO నిబంధనల ప్రకారం సభ్యదేశాలన్నింటి అధినేతలు,ప్రభుత్వ ప్రధానులకు ఆహ్వానాలు పంపడం ఆతిథ్య దేశం బాధ్యత అని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగానే భారత్కు కూడా ఆహ్వానం తప్పనిసరిగా పంపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదే మీడియా సమావేశంలో మనీలాలో జరగనున్న ఆసియాన్ (ASEAN) సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్,పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి.
వివరాలు
ఈ సంస్థలో సభ్యదేశాలుగా..
దీనికి స్పందించిన పాక్ ప్రతినిధి, అలాంటి భేటీ కోసం భారత్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అభ్యర్థన అందలేదని తెలిపారు.
యూరేషియా ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం, ఆర్థిక సహకారాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో 2001 జూన్ 15న బీజింగ్లో షాంఘై సహకార సంస్థ (SCO) ఏర్పాటైంది.
ప్రస్తుతం ఈ సంస్థలో భారత్, పాకిస్థాన్, చైనా, రష్యా, ఇరాన్, బెలారస్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి.
వివరాలు
2027 సంవత్సరానికి పాకిస్థాన్కు అధ్యక్ష బాధ్యతలు
SCOలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థగా ఉన్న కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ (CHS) అధ్యక్ష బాధ్యతలు ప్రతి ఏడాది సభ్యదేశాల పేర్లను ఆంగ్ల అక్షరక్రమం ప్రకారం మారుతూ ఉంటాయి.
ఈ విధానంలో భాగంగానే 2027 సంవత్సరానికి పాకిస్థాన్కు అధ్యక్ష బాధ్యతలు లభించాయి.
దీంతో ఆ ఏడాది షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ నేపథ్యంలో సభ్యదేశాలన్నింటికీ, అందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా అధికారిక ఆహ్వానం పంపనున్నట్లు పాకిస్థాన్ వెల్లడించింది.