Page Loader
Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాది.. మాజీ స్పెషల్ ఫోర్స్ కమాండో 
పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాది.. మాజీ స్పెషల్ ఫోర్స్ కమాండో

Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాది.. మాజీ స్పెషల్ ఫోర్స్ కమాండో 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2025
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం దాడిలో పాలుపంచుకున్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరిగా గుర్తించిన హషిమ్ మూసా, పాకిస్థాన్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండోగా పనిచేశాడని దర్యాప్తు బృందాలు తేల్చాయి. ప్రస్తుతం అతను ఓ అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదిగా మారిపోయినట్లు విచారణలో వెల్లడైంది. లష్కరే తోయిబా అనే పాక్‌కు చెందిన ఉగ్రసంస్థతో కలిసి అతను కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని సమాచారం. ఆ సంస్థ నేతలు, మూసాను కశ్మీర్ ప్రాంతానికి పంపారని దర్యాప్తు అధికారులు తెలిపారు. భారత సైన్యం ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాలకు తోడ్పాటుగా ఉన్నారన్న అనుమానంతో వందలమంది స్థానికులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుంది. వీరిలో 15మంది ఉగ్రవాద ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లు (OGWs)గా గుర్తించబడ్డారు. మూసా పాక్ సైన్యంలో ఉన్న అనుభవాన్ని వారు ధృవీకరించారని అధికారులు వెల్లడించారు.

వివరాలు 

పాక్ పారా కమాండోలు అత్యాధునిక శిక్షణ పొందిన యోధులు

"హషిమ్ మూసా, పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరే తోయిబాలో సహాయకుడిగా చేరిన వ్యక్తి" అని దర్యాప్తులో ఉన్న ఓ అధికారి మీడియాతో వెల్లడించారు. ఈ పరిణామం, పాక్ సైన్యం మరియు ఉగ్రవాద సంస్థల మధ్య ఉన్న బంధాన్ని స్పష్టంగా చాటుతోందని చెప్పారు. పాక్ పారా కమాండోలు అత్యాధునిక శిక్షణ పొందిన యోధులు. వీరికి సంప్రదాయేతర యుద్ధనీతులు, రహస్య ఆపరేషన్లలో ప్రావీణ్యం కలిగి ఉంటుంది. శారీరకంగా, మానసికంగా బలోపేతం చేసే శిక్షణతోపాటు, వారిని యుద్ధనిర్వహణలో చురుకుగా తీర్చిదిద్దుతారు. అలాగే ఆధునిక ఆయుధాల వినియోగం, హస్తయుద్ధ నైపుణ్యం కలిగి ఉంటారు.

వివరాలు 

మూడు దాడుల్లోనూ పాల్గొన్న మూసా

ఈ దాడిలో పాలుపంచుకున్న కొంతమంది గతంలో గగన్‌నగర్‌, గదర్‌బాల్‌ అడవుల్లో జరిగిన దాడుల్లోనూ భాగస్వాములయ్యారు. అక్కడ ఆరుగురు స్థానికేతరులు, ఒక డాక్టర్‌, ఇద్దరు సైనిక పోర్టర్లను హత్య చేసిన ఘటనల్లో వారివారిది పాత్ర ఉన్నట్టు గుర్తించారు. మూసా ఈ మూడు దాడుల్లోనూ పాల్గొన్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. అలాగే జునైద్ భట్, అర్బాజ్ మిర్ అనే ఇతర ఉగ్రవాదులు కూడా పాక్‌లో శిక్షణ పొందిన వారిగా గుర్తించబడ్డారు.

వివరాలు 

భద్రతా దళాల దృష్టి నుంచి తృటిలో..

పహల్గాం దాడి ప్రణాళికను అమలు చేసేందుకు ఈ ముఠా దాదాపు 22 గంటలపాటు కాలినడక ప్రయాణం చేసినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు ట్రెక్కింగ్ చేస్తూ ఉగ్రదాడికి సన్నద్ధమయ్యారు. ఈ రకమైన ప్రయాణం,వారందరికి సైనిక స్థాయిలో శిక్షణ పొందినట్టు స్పష్టంగా సూచిస్తుంది. ప్రస్తుతం భారత సైన్యం వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే నాలుగుసార్లు వారు భద్రతా దళాల దృష్టి నుంచి తృటిలో తప్పించుకున్నారు. అయితే త్వరలోనే వారిని పట్టుకునే అవకాశం ఉందని భద్రతా అధికారులు భావిస్తున్నారు.