Andhra Pradesh : చిత్తూరు బుడ్డమాను చెరువు వద్ద జంట ఏనుగులు.. ఉలిక్కిపడ్డ ప్రజలు
ఈ వార్తాకథనం ఏంటి
చిత్తూరు నగరంలో ఆదివారం రెండు ఏనుగులు ఒక్కసారిగా ప్రత్యక్షమవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దంతాలు కలిగిన రెండు మగ ఏనుగులు సంతపేట సమీపంలోని బుడ్డమాను చెరువు వద్ద ఉన్నట్లు గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఏనుగులను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చెరువు ప్రాంతానికి చేరుకోగా,పోలీసులు,అటవీ అధికారులు వారిని ఏనుగుల దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో ఒక ఏనుగు ఎఫ్బీవో రెడ్డెప్పపై దాడికి ప్రయత్నించగా, ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
వివరాలు
20 రోజులుగా ఏనుగులను గమనిస్తున్నఅటవీ సిబ్బంది,ట్రాకర్లు
రోజంతా ఏనుగులు చెరువులోనే సేదతీరాయి. వాటికి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ, ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. డీఎఫ్వో సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం, ఈ జంట ఏనుగులను గత 20 రోజులుగా అటవీ సిబ్బంది, ట్రాకర్లు గమనిస్తున్నారని చెప్పారు. తమిళనాడులోని కాట్పాడి సమీపం నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈ ఏనుగులు గుడిపాల, ఎస్ఆర్పురం, కార్వేటినగరం, వెదురుకుప్పం, పెనుమూరు మండలాల మీదుగా ప్రయాణిస్తూ చిత్తూరుకు చేరుకున్నాయని వివరించారు. రాత్రి చీకటి పడిన తర్వాత అవి ఏ దిశగా కదులుతాయో గమనించి, ఆ దిశలోని అడవుల్లోకి మళ్లించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.