Loading...
Jharkhand: జార్ఖండ్‌ పరీక్షల అక్రమాలపై ఉధృతమవుతున్న ఉద్యమం.. చర్చలకు ప్రభుత్వం సిద్ధం
జార్ఖండ్‌ పరీక్షల అక్రమాలపై ఉధృతమవుతున్న ఉద్యమం.. చర్చలకు ప్రభుత్వం సిద్ధం

Jharkhand: జార్ఖండ్‌ పరీక్షల అక్రమాలపై ఉధృతమవుతున్న ఉద్యమం.. చర్చలకు ప్రభుత్వం సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2026
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్‌లో పోటీ పరీక్షల్లో జరిగిన అక్రమాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసి,పరీక్షల నిర్వహణ వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలన్న డిమాండ్‌తో వారం రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. బుధవారం రాంచీలోని జైపాల్‌సింగ్‌ ముండా స్టేడియంలో దీక్ష చేపట్టిన ఉద్యోగార్థులు, ఉద్యమకారులకు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరుకుని తమ మద్దతు ప్రకటించారు. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ మంగళవారం రాత్రి మరో ఐదుగురు నిరాహార దీక్షలో చేరారు.వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

వివరాలు 

నిరాహార దీక్షలో ఉద్యమనేత సబితా కుమారి

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్‌ఎస్‌సీ) సంస్కరణల మంచ్ అధికార ప్రతినిధి జీవన్ కుమార్ మాట్లాడుతూ, ఉద్యమానికి నైతిక బలం చేకూర్చేందుకు కొత్తగా ఐదుగురు దీక్షలో పాల్గొన్నారని, విద్యార్థుల డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే తాను నిరాహార దీక్షలో పాల్గొన్నట్లు ఉద్యమనేత సబితా కుమారి తెలిపారు.

బుధవారం దీక్షా శిబిరంలో జాతీయ జెండాలతో 'తిరంగా యాత్ర' నిర్వహించి ఉద్యమానికి మరింత ఊపు తీసుకొచ్చారు.

'జేపీఎస్‌సీ-జేఎస్‌ఎస్‌సీ రిఫార్మ్స్ మంచ్' ఆధ్వర్యంలో ఉద్యోగార్థులు జూలై 25 నుంచి ఈ ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

వివరాలు 

చర్చలకు ప్రభుత్వం ఆహ్వానం

ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో రాంచీ సబ్ డివిజనల్ ఆఫీసర్ కుమార్ రజత్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (శాంతిభద్రతలు) ధనంజయ్ కుమార్ దీక్షా శిబిరాన్ని సందర్శించారు.

ముఖ్యమంత్రి అధికార నివాసంలో జరిగే చర్చలకు ఐదుగురు ఉద్యమనేతలను అధికారులు అధికారికంగా ఆహ్వానించారు.

ADVERTISEMENT

వివరాలు 

కనీసం నీళ్లు తాగాలని వాంగ్‌చుక్ సూచన

లద్దాఖ్ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ బుధవారం నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమకారులకు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీర్ఘకాల నిరాహార దీక్ష చేపట్టిన ఆయన, జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (జేఎల్‌కేఎం) నేత దేవేంద్రనాథ్ మహతోతో ఫోన్‌లో మాట్లాడారు.

దీర్ఘకాల నిరాహార దీక్ష వల్ల బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ స్థాయిలు పడిపోతాయని, ఆరోగ్యం మరింత క్షీణించకుండా ఉండాలంటే కనీసం నీళ్లు అయినా తాగాలని సూచించారు.

అలా చేస్తే ఎక్కువ రోజులు దీక్షను కొనసాగించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. వాంగ్‌చుక్ సూచన మేరకు దేవేంద్రనాథ్ మహతో అనంతరం కొద్దిగా నీరు తాగారు.

ADVERTISEMENT

వివరాలు 

విద్యార్థుల ప్రధాన డిమాండ్లు ఇవే..

ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులు 14వ జేపీఎస్‌సీ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నారు.

అలాగే జేఎస్‌ఎస్‌సీలో సమగ్ర సంస్కరణలు అమలు చేయాలని, గతంలో జరిగిన పరీక్షల అక్రమాలపై సీబీఐ లేదా ఇతర రాష్ట్రాల హైకోర్టు మాజీ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

వివరాలు 

ప్రశ్నాపత్రాల లీకేజీ దేశవ్యాప్త సమస్య: సీఎం సోరెన్

ఉద్యమంపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 'ఎక్స్' వేదికగా స్పందించారు.

యువత లేవనెత్తిన అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేవలం జార్ఖండ్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా యువతను ప్రభావితం చేస్తున్న సమస్యగా మారిందన్నారు.

రాష్ట్రంలో రాత్రింబవళ్లు దర్యాప్తు కొనసాగుతోందని, అక్రమాలకు పాల్పడిన వారిని తప్పకుండా జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.

దర్యాప్తుతోనే ఆగిపోకుండా యువత ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.

వివరాలు 

విద్యార్థులకు అండగా ఉంటాం: అభిజీత్ దీప్కే

ఉద్యమంలో పాల్గొంటున్న వందలాది మంది విద్యార్థులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చీఫ్ అభిజీత్ దీప్కే తెలిపారు.

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో పార్టీ కీలక సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, జార్ఖండ్‌లో పోటీ పరీక్షల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.

ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరిస్తామని ప్రకటించే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

త్వరలో జార్ఖండ్‌కు వెళ్లి ఉద్యమిస్తున్న విద్యార్థులతో కలిసి వారి ప్రతి డిమాండ్ సాధన కోసం పోరాడతామని అభిజీత్ దీప్కే ప్రకటించారు.

ADVERTISEMENT