
Pasala Krishna Bharathi: స్వాతంత్య్ర సమరయోధ కుటుంబ వారసురాలు పసల కృష్ణభారతి ఇకలేరు
ఈ వార్తాకథనం ఏంటి
గాంధేయవాది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి (92) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని స్నేహపురి కాలనీలో స్వగృహంలో కన్నుమూశారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతుల రెండో కుమార్తె ఆమె. జీవితాంతం గాంధేయవాదిగా ఉండి, గాంధీజీ ప్రవచించిన విలువలతో జీవించారు.
పలు విద్యాసంస్థలకు నిధులు అందించి, దళితుల్లో విద్యా వ్యాప్తికి కృషి చేశారు. గోశాలలకు విరాళాలు సమకూర్చారు.
Details
కృష్ణభారతికి నలుగురు అన్నదమ్ములు
అవివాహితగా ఉన్న కృష్ణభారతికి నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. 2022 జులైలో భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెను సత్కరించారు.
పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. 1932 జూన్లో భీమవరం సబ్ కలెక్టర్ కార్యాలయంపై జెండా ఎగురవేసిన ఘటనలో పాల్గొన్న కృష్ణమూర్తి దంపతులను బ్రిటిష్ ప్రభుత్వం కఠినంగా శిక్షించింది.
ఆ సమయంలో అంజలక్ష్మి ఆరు నెలల గర్భిణి అయినా, బ్రిటిష్ ప్రభుత్వం కనికరించలేదు. జైలులోనే కృష్ణభారతి జన్మించారు.
కారాగారంలో జన్మించిన శ్రీకృష్ణుడిని, స్వతంత్ర భారతి ఆకాంక్షను గుర్తు చేస్తూ తల్లిదండ్రులు ఆమెకు కృష్ణభారతి అని పేరుపెట్టారు. ఆమె తొలి 10 నెలల బాల్యం కారాగారంలోనే గడిచింది.
Details
వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన అనుభవం
పడమర విప్పర్రు గ్రామంలోని తమ మొత్తం ఆస్తిని స్వాతంత్య్ర పోరాటం కోసం కృష్ణమూర్తి దంపతులు త్యాగం చేశారు.
పశ్చిమ గోదావరిలో గాంధీజీ పర్యటన సందర్భంగా కృష్ణమూర్తి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.
జీవితాంతం కుష్టు రోగులు, అభాగ్యుల సేవలో నిలిచిన కృష్ణభారతి చివరి వరకు గాంధేయ విలువలతో జీవించారు.