India Today-C Voter: మోదీయే ప్రధాని కావాలంటున్న 49% మంది.. ఎన్డీయేకు 326 సీట్లు: ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేలో వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటికిప్పుడు దేశంలో లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీయే కూటమి మరోసారి ఆధిక్యం సాధించే అవకాశాలున్నాయని ఇండియాటుడే-సీ ఓటర్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే వెల్లడించింది. ఎన్డీయేకు 45శాతం ఓట్లు లభించి మొత్తం 326స్థానాలు దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో భాజపా 261 సీట్లు, మిత్రపక్షాలు 65 స్థానాలు గెలుచుకోవచ్చని తెలిపింది. ఏటా రెండుసార్లు 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో చేపట్టిన సర్వేలో ఎన్డీయేకు 352 లోక్సభ స్థానాలు వస్తాయని అంచనా వేశారు. తాజా సర్వేలో ఆ సంఖ్య 26 సీట్లు తగ్గి 326కు చేరింది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 185 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.
వివరాలు
ఆరు నెలలుగా 91,795 మందితోనూ ఇంటర్వ్యూలు
జనవరి సర్వేతో పోలిస్తే ఈ కూటమికి మూడు సీట్లు పెరిగాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన 234 స్థానాలతో పోల్చితే ప్రస్తుతం అంచనా వేసిన సీట్లు 49 తక్కువగా ఉన్నాయి.
జులై 1 నుంచి ఆగస్టు 25 వరకు దేశవ్యాప్తంగా 25,184 మందిని నేరుగా ఇంటర్వ్యూ చేసి ఈ సర్వే నిర్వహించినట్లు సీ ఓటర్ సంస్థ తెలిపింది.
ప్రస్తుత సర్వేలో జులై-ఆగస్టు మధ్య నిర్వహించిన ఇంటర్వ్యూలతో పాటు గత ఆరు నెలలుగా మరో 91,795 మందిని ఇంటర్వ్యూ చేసిన వివరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సీ ఓటర్ వెల్లడించింది.
వివరాలు
ఆరు నెలలుగా 91,795 మందితోనూ ఇంటర్వ్యూలు
ఈ కాలంలో చోటుచేసుకున్న జెన్ జీ ఉద్యమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు వంటి అంశాలు భాజపా ప్రతిష్ఠపై కొంత ప్రభావం చూపినట్లు సర్వే విశ్లేషించింది.
భాజపా గెలిచే అవకాశమున్న లోక్సభ స్థానాలు గత ఆరు నెలల్లో 287 నుంచి 261కి తగ్గినట్లు పేర్కొంది.
అయినప్పటికీ 2024 ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన 240 స్థానాల కంటే ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది.
అయితే లోక్సభలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సాధారణ మెజార్టీ కంటే భాజపా అంచనా సీట్లు 11 తక్కువగా ఉండటం గమనార్హం.
వివరాలు
సెంచరీ దాటనున్న కాంగ్రెస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నిర్వహించిన ప్రజా ఉద్యమాలు ఆ పార్టీకి కొంత మేర కలిసొచ్చినట్లు సర్వే అంచనా వేసింది.
జనవరి నుంచి ఆగస్టు మధ్య కాంగ్రెస్ అంచనా సీట్లు 80 నుంచి 106కు పెరిగినట్లు తెలిపింది.
దీంతో ఆ పార్టీ లోక్సభలో 100 స్థానాల మార్కును దాటే అవకాశం ఉందని పేర్కొంది.
ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. జనవరిలో ఎన్డీయేకు 47 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేయగా, తాజా సర్వేలో అది 45.1 శాతానికి తగ్గింది.
మరోవైపు ఇండియా కూటమి ఓట్ల శాతం 39 నుంచి స్వల్పంగా 0.1 శాతం పెరిగినట్లు సర్వే వెల్లడించింది.
వివరాలు
ప్రధాని పదవికి ఎవరు?
ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు 49 శాతం మంది నరేంద్ర మోదీకి మద్దతు తెలిపారు.
రాహుల్ గాంధీని 27 శాతం మంది ఇష్టపడినట్లు సర్వే పేర్కొంది.
ఇదిలా ఉండగా.. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని పార్టీకి ప్రస్తుతం పార్లమెంటులో ఒక్క ఎంపీ కూడా లేనప్పటికీ, ప్రధానమంత్రి అభ్యర్థుల ఎంపికలో 9 శాతం మద్దతుతో మూడో స్థానంలో నిలవడం సర్వేలో ప్రత్యేకంగా నిలిచిన అంశంగా మారింది.