APMDC Award: ఏపీఎండీసీకి ప్రతిష్ఠాత్మక అవార్డు.. రూ.9 వేల కోట్ల సమీకరణకు గోల్డ్ మెడల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి ప్రతిష్ఠాత్మకమైన 'బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్ బంగారు పతకం' లభించింది. ముంబయిలో నిర్వహించిన అసోచామ్ 9వ నేషనల్ సమిట్ అండ్ అవార్డ్స్ ఆన్ కార్పొరేట్ బాండ్ మార్కెట్ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ అవార్డును ఏపీఎండీసీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సీఎఫ్వో) ఫణికుమార్, కంపెనీ కార్యదర్శి ఎస్.శివరామకృష్ణ స్వీకరించారు. ఇటీవల ఏపీఎండీసీ కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) జారీ చేసి రూ.9 వేల కోట్లను సమీకరించింది.
వివరాలు
ఈ గుర్తింపు సంస్థ సామర్థ్యానికి నిదర్శనం
రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఇంత భారీ మొత్తాన్ని కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా విజయవంతంగా సమీకరించినందుకుగానూ ఏపీఎండీసీకి ఈ అవార్డు దక్కింది.
ఈ గుర్తింపు సంస్థ సామర్థ్యానికి నిదర్శనమని ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్కుమార్ తెలిపారు.
ఏపీ ప్రభుత్వ రంగ సంస్థగా ఉత్తమ గవర్నెన్స్ విధానాలు, సమర్థవంతమైన పాలన, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, కార్పొరేట్ గవర్నెన్స్ కోసం ఏపీఎండీసీ చేస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలుస్తుందని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.