Page Loader
Vande Bharat train: కాశ్మీర్‌కు మొదటి వందేభారత్‌ రైలు.. వచ్చే నెలలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ 
కాశ్మీర్‌కు మొదటి వందేభారత్‌ రైలు.. వచ్చే నెలలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Vande Bharat train: కాశ్మీర్‌కు మొదటి వందేభారత్‌ రైలు.. వచ్చే నెలలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 27, 2025
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

వందే భారత్‌ రైల్వే సర్వీసు తొలిసారి కశ్మీర్‌ లోయ (Kashmir Valley)లో అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 19న కట్రా-శ్రీనగర్‌ మధ్య ప్రత్యేక వందే భారత్‌ రైలు (special Vande Bharat train)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించనున్నారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అనంతరం కట్రాలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అలాగే, జమ్ముకశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై నిర్మితమైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (Chenab Rail Bridge)ను సందర్శించనున్నట్లు సమాచారం. ప్రారంభంలో ఈ రైలు కట్రా-శ్రీనగర్‌ మార్గంలో నడుస్తుంది, తర్వాత జమ్ము రైల్వే స్టేషన్‌ విస్తరణ పనులు పూర్తైన తర్వాత, శ్రీనగర్‌కు వెళ్లే మార్గంగా విస్తరించనుందని తెలుస్తోంది.

వివరాలు 

రైలులో అత్యాధునిక హీటింగ్‌ వ్యవస్థ

ఇదిలా ఉంటే, ఇంజినీరింగ్‌ అద్భుతమైన చీనాబ్‌ వంతెనపై ఇటీవల వందే భారత్‌ రైలు (Vande Bharat Train) తొలిసారిగా ప్రయాణించింది. ఈ సెమీ హైస్పీడ్‌ రైలు ట్రయల్‌ రన్‌ను భారతీయ రైల్వే విజయవంతంగా నిర్వహించింది. కట్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్‌ నుంచి శ్రీనగర్‌ వరకు వందే భారత్‌ రైలు ప్రయాణించగా, ఈ మార్గంలో చీనాబ్‌ నదిపై నిర్మితమైన వంతెన ప్రధాన ఆర్చ్‌పై పరుగెత్తిన దృశ్యాలు చూడముచ్చటగా మారాయి. కశ్మీర్‌ (Jammu and Kashmir) లోయలోని తీవ్రమైన శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్‌ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. మంచు,తక్కువ ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించేందుకు అత్యాధునిక హీటింగ్‌ వ్యవస్థలను ఇందులో అమర్చారు.