LOADING...
Srinagar Raghunath Temple: మూడు దశాబ్దాల తర్వాత రఘునాథ్ మందిరం పునఃప్రారంభం.. కశ్మీర్‌లో ఐక్యతకు కొత్త చిహ్నం
మూడు దశాబ్దాల తర్వాత రఘునాథ్ మందిరం పునఃప్రారంభం.. కశ్మీర్‌లో ఐక్యతకు కొత్త చిహ్నం

Srinagar Raghunath Temple: మూడు దశాబ్దాల తర్వాత రఘునాథ్ మందిరం పునఃప్రారంభం.. కశ్మీర్‌లో ఐక్యతకు కొత్త చిహ్నం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2026
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

కశ్మీర్ లోయలో మూడు దశాబ్దాలకు పైగా మూతపడిన ఓ చారిత్రక హిందూ ఆలయం మళ్లీ ప్రజల కోసం తెరుచుకుంది. శ్రీనగర్‌లోని హబ్బాకడల్ ప్రాంతంలో ఉన్న రఘునాథ్ మందిరాన్ని రామ నవమి పర్వదినం సందర్భంగా పునఃప్రారంభించడం విశేషంగా నిలిచింది. సుమారు 35 ఏళ్ల విరామం అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో కశ్మీరీ పండిట్లు, స్థానిక ముస్లిములు, పౌర, పోలీసు అధికారులు పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ అక్షయ్ లబ్రూ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో రామ నవమి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పౌర యంత్రాంగం, పోలీసులు, స్థానిక ప్రజలు, ఆలయ నిర్వాహకుల సహకారంతో ఇది సాధ్యమైందని తెలిపారు.

వివరాలు

ఆలయ చరిత్ర - పునరుద్ధరణ ప్రయాణం

ఇదే నెలలో నవరాత్రి, నవ్రోజ్‌తో పాటు రామ నవమిని కూడా శాంతియుత వాతావరణంలో జరుపుకోవడం ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు. ఈ రఘునాథ్ ఆలయాన్ని 1857లో మహారాజా గులాబ్ సింగ్ నిర్మించారు. జమ్మూలోని రఘునాథ్ ఆలయ నమూనాను అనుసరించి దీన్ని నిర్మించినట్లు సమాచారం. 1990ల ప్రారంభంలో కశ్మీర్ లోయలో ఉగ్రవాదం పెరిగి, కశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున వలస వెళ్లిన సమయంలో అనేక ఆలయాలతో పాటు ఈ ఆలయం కూడా మూసివేయబడింది. కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాన్ని పునరుద్ధరించేందుకు 2020లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద చర్యలు ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్ పర్యాటక శాఖ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్(INTACH) సహకారంతో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి.

వివరాలు

స్థానికుల్లో ఆనందం - సామరస్యానికి నిదర్శనం

ఆలయం తిరిగి ప్రారంభం కావడంతో స్థానికులు, ముఖ్యంగా ముస్లిం సమాజం సంతోషం వ్యక్తం చేసింది. ఫతేకడల్‌కు చెందిన 72 ఏళ్ల అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ, ఈ ఆలయం తమ సంస్కృతి, వారసత్వంలో భాగమని, రామ నవమి సందర్భంగా తిరిగి తెరవడం ఆనందంగా ఉందన్నారు. కశ్మీరీ పండిట్ సోదరులు మళ్లీ లోయకు తిరిగి వచ్చి కలిసి జీవించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు భరత్ రైనా మాట్లాడుతూ, ఈ వేడుకలు హిందూ-ముస్లిం సోదరభావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

Advertisement

వివరాలు

సహకారాన్ని అందించిన ముస్లిం సోదరులు

గత నాలుగు రోజులుగా తాము అక్కడే ఉండగా ముస్లిం సోదరులు పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు. రఘునాథ్ ఆలయం పునఃప్రారంభం విజయవంతమవడంతో, మూతపడిన ఇతర ఆలయాల పునరుద్ధరణకు కూడా మార్గం సుగమమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన చేపట్టనున్నట్లు, కశ్మీరీ పండిట్లు తిరిగి లోయకు రావడానికి ఇది అనుకూల సమయమని తెలిపారు.

Advertisement