'Vote Chori Aayog': ఓటు చోరీతో భాజపా గెలుపు.. ఎన్నికల సంఘంపై రాహుల్, ఖర్గే ధ్వజం
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ తర్వాత విడుదల చేసిన ముసాయిదా జాబితా నుంచి ఏకంగా 2.06 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఎలాగైనా భాజపాకు విజయం దక్కేలా చేయాలన్న ఉద్దేశంతో భాజపా,''ఓటు చోరీ సంఘం''తమ వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ఓట్ల అక్రమాలతో ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలు పట్టడం లేదని రాహుల్ విమర్శించారు. అందుకే భాజపా ప్రజల మాటను ఏనాడూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. 2024మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల తర్వాత,శాసనసభ ఎన్నికలకు ముందు ఒక్కసారిగా 39లక్షల ఓట్లు పెరిగాయని గుర్తుచేశారు. ''ఆ సమయంలోనూ ఇదే విషయం చెప్పాను.ఇప్పుడు కూడా చెబుతున్నాను.ఇది ఓటు చౌర్యమే''అని రాహుల్గాంధీ స్పష్టం చేశారు.
వివరాలు
భాజపా అధికారాన్ని కాపాడే సంస్థగా ఎన్నికల సంఘం: ఖర్గే
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం.. భాజపా అధికారాన్ని కాపాడే సంస్థలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
ఓట్లలో అక్రమాలకు పాల్పడటం ద్వారా దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు అధికార పార్టీ చేస్తున్న కుట్రలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు.
భాజపా కుట్రను ప్రజలు అర్థం చేసుకున్నారని, ఓట్ల చౌర్యానికి వ్యతిరేకంగా వారు ఏకమవుతున్నారని ఖర్గే తెలిపారు.
దీనికి బాధ్యులైన వారిని ప్రజలు శిక్షిస్తారని తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
వివరాలు
భాజపా అధికారాన్ని కాపాడే సంస్థగా ఎన్నికల సంఘం: ఖర్గే
తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో భాజపా ఓట్లను పెంచుకుంటుందని, అవసరం లేని చోట ఓట్లను తొలగిస్తోందని ఖర్గే ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లలో 91 శాతం మందిని అప్పీళ్ల తర్వాత తిరిగి చేర్చాల్సి వచ్చిందని తెలిపారు.
ఎన్నికలకు ముందు భాజపా విజయానికి అనుకూలంగా ఈ ఓట్లను తొలగించారా? అన్నదే అసలు ప్రశ్న అని ఆయన పేర్కొన్నారు.
దిల్లీలోనూ ఇదే విధానం కొనసాగిందని ఖర్గే ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఓటర్ల సంఖ్యను పెంచారని తెలిపారు.
ఇప్పుడు ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి 47.56 లక్షల ఓట్లు కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు.
మరో 33 లక్షల మందికి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు.
వివరాలు
నొయిడా ఘటననూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు: రాహుల్
ఉత్తర్ప్రదేశ్లోని నొయిడాలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాల తీరును మంగళవారం ఆయన తప్పుబట్టారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం కనిపించడం లేదని విమర్శించారు.
గతంలో చోటుచేసుకున్న నేరాల మాదిరిగానే ఈ ఘటనను కూడా కప్పిపుచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని రాహుల్ ఆరోపించారు.
దిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
మహిళల భద్రత విషయంలో..
గ్రేటర్ నొయిడా నుంచి దిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో ఓ మైనర్పై సామూహిక అత్యాచారం జరగడం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు.
ఇంత తీవ్రమైన ఘటన జరిగినప్పటికీ దిల్లీ పోలీసులు, నొయిడా పోలీసులు కనీస సమాచారం కూడా తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యకరమన్నారు.
ఆ బస్సు నొయిడా-గ్రేటర్ నొయిడా ఎక్స్ప్రెస్వే మీదుగా దిల్లీ రింగ్ రోడ్డుకు చేరిందని రాహుల్ తెలిపారు.
ఇంత దూరం ప్రయాణించినా ఒక్క తనిఖీ కేంద్రం వద్ద కూడా బస్సును ఆపకపోవడంపై ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.
ఈ ఘటనపై 'ఎక్స్' వేదికగా స్పందించిన రాహుల్గాంధీ.. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిలదీశారు.