LOADING...
Revanth Reddy: 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గేలకు ప్రభుత్వ ఆహ్వానం
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గేలకు ప్రభుత్వ ఆహ్వానం

Revanth Reddy: 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గేలకు ప్రభుత్వ ఆహ్వానం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించాలని నిర్ణయించింది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుండగా, వారిని స్వయంగా కలుసుకుని ఆహ్వానాలు అందజేయేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో వెళ్లనున్నారు.

వివరాలు 

రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రత్యేక ఆహ్వాన కమిటీ  ఏర్పాటు 

ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక విశ్లేషకులు, క్రీడారంగ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, దౌత్యవేత్తలు తదితరులకు ఆహ్వానాలు పంపనున్నారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రత్యేక ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కార్యకలాపాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన 4,500 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపగా, 1,000 మంది తమ హాజరును ధ్రువీకరించినట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రకటించారు.

వివరాలు 

నీతి ఆయోగ్, ఐఎస్బీ వంటి సంస్థల సహకారంతో ఈ డాక్యుమెంట్

ఈ సదస్సు వేదికగా 'తెలంగాణ రైజింగ్ - 2047' పేరుతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఇప్పటివరకు వచ్చిన అనుభవాలను అధ్యయనం చేస్తూ, రాబోయే తరాల అభివృద్ధి దిశగా సాగేందుకు ఈ దార్శనిక పత్రాన్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. నీతి ఆయోగ్, ఐఎస్బీ వంటి సంస్థల సహకారంతో ఈ డాక్యుమెంట్ రూపుదిద్దుకుంటోంది.

Advertisement

వివరాలు 

కీలక ప్రాజెక్టులను అమలు చేయనున్న ప్రభుత్వం

అభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి ముందుకు తీసుకెళ్లనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు 'కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ' (CURE)ను ప్రోత్సహించనున్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ బయట ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ పరిధిని 'పెరి అర్బన్ రీజియన్ ఎకనామిక్' (PURE) జోన్‌గా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. ఈ సమగ్ర ప్రణాళికలో భాగంగా మూసీ సుందరీకరణ, మెట్రో రైలు విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం, గ్రీన్‌ఫీల్డ్ హైవే, బుల్లెట్ రైలు వంటి కీలక ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement