LOADING...
Bhagwant Mann: భగవంత్ మాన్‌కు కొత్త చిక్కులు.. ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కేసులో అరెస్ట్ చేయాలన్న బీజేపీ
రూ.10 లక్షలతో నకిలీ నివేదిక?.. భగవంత్ మాన్‌పై కొత్త ఆరోపణలు

Bhagwant Mann: భగవంత్ మాన్‌కు కొత్త చిక్కులు.. ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కేసులో అరెస్ట్ చేయాలన్న బీజేపీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే అత్యున్నత సిక్కు మత సంస్థ అయిన అకాల్ తఖ్త్ ఆయనపై కఠిన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ఇప్పుడు మరో వివాదం చెలరేగింది. సిక్కు గురువుల చిత్రాలపై మద్యం చల్లినట్లు చూపించిన వైరల్ వీడియోకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను నకిలీగా తయారు చేయించారనే ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాన్ అరెస్ట్‌తో పాటు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. గత వారం అకాల్ తఖ్త్ ఆ వైరల్ వీడియో వ్యవహారంపై స్పందిస్తూ భగవంత్ మాన్‌ను "సిక్కు వ్యతిరేకి"గా ప్రకటించింది. దీనికి ప్రతిస్పందనగా మాన్ ప్రభుత్వం రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో వీడియోను పరిశీలించి నివేదిక సిద్ధం చేసినట్లు ప్రకటించింది.

వివరాలు 

నకిలీ ఫోరెన్సిక్ నివేదిక..

ఆ నివేదికలో వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి భగవంత్ మాన్ కాదని,ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి వీడియోను సృష్టించి ప్రచారం చేశారని పేర్కొంది. అయితే ఈ వ్యవహారం తాజాగా సంచలన మలుపు తిరిగింది. గురుగ్రామ్ పోలీసులు ఈ ఫోరెన్సిక్ నివేదిక నకిలీగా తయారైందన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. వైరల్ వీడియో కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను తారుమారు చేసేందుకు కుట్ర జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన అంకిత్, పంచకులాకు చెందిన అరుణ్‌ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం,పంజాబ్ ప్రభుత్వ ఉన్నతాధికారులమని చెప్పుకున్న కొందరు వ్యక్తులు ముందుగానే నిర్ణయించిన అంశాలతో ఫోరెన్సిక్ నివేదిక సిద్ధం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు.

వివరాలు 

నివేదికను అనుకూలంగా తయారు చేస్తే రూ.10 లక్షల నగదు సహా భారీ మొత్తంలో డబ్బు

వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి భగవంత్ మాన్ కాదని తేల్చేలా నివేదిక ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, నివేదికను తమకు అనుకూలంగా తయారు చేస్తే రూ.10 లక్షల నగదు సహా భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. నివేదికలో పలు మార్లు మార్పులు చేయాలని కూడా ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పార్టీ నేత మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ, భగవంత్ మాన్ సిక్కులను, అకాల్ తఖ్త్‌ను అవమానించారని ఆరోపించారు. తన ఆర్థిక శక్తిని ఉపయోగించి అకాల్ తఖ్త్ నిర్ణయాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేశారని, వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

వివరాలు 

నకిలీ నివేదిక తయారీ వ్యవహారంలో లూధియానా పోలీసుల కీలక పాత్ర: సిర్సా

లూధియానా పోలీస్ కమిషనర్ స్వపన్ శర్మ,ఎస్పీ జశన్‌దీప్ సింగ్‌లు ఈ నకిలీ నివేదిక తయారీ వ్యవహారంలో పాత్ర పోషించారని కూడా సిర్సా ఆరోపించారు. గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో పంజాబ్ పోలీసు అధికారులు,నిందితుల మధ్య ఈ ఒప్పందం జరిగిందని,అక్కడే డబ్బుల లావాదేవీలు కూడా జరిగినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మౌనం ఎందుకు పాటిస్తున్నారని సిర్సా ప్రశ్నించారు.

Advertisement

వివరాలు 

రాజకీయ ప్రత్యర్థులు సృష్టించిన కుట్ర ఆయా వీడియో :భగవంత్ మాన్

సిక్కుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఆయన ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. మరోవైపు, గత వారం విడుదలైన ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా భగవంత్ మాన్ స్పందిస్తూ వైరల్ వీడియో తన రాజకీయ ప్రత్యర్థులు సృష్టించిన కుట్ర అని ఆరోపించారు. వీడియో వెనుక ఉన్నవారిని పంజాబ్ పోలీసులు గుర్తించి శిక్షిస్తారని హెచ్చరించారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోర్జరీ ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి. దీంతో భగవంత్ మాన్‌పై బీజేపీ దాడిని మరింత ఉధృతం చేసింది.

Advertisement