Page Loader
Telangana: రూ. 6.50 కోట్ల పనిదినాల టార్గెట్‌.. జూన్‌ నెలకే చేరనున్న తెలంగాణ!
రూ. 6.50 కోట్ల పనిదినాల టార్గెట్‌.. జూన్‌ నెలకే చేరనున్న తెలంగాణ!

Telangana: రూ. 6.50 కోట్ల పనిదినాల టార్గెట్‌.. జూన్‌ నెలకే చేరనున్న తెలంగాణ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లోనే 4.54 కోట్ల పనిదినాలు పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన 6.50 కోట్ల పనిదినాల లక్ష్యంలో సుమారు 70 శాతం పనిని పూర్తి చేయడమే కాక, అత్యధిక మందికి ఉపాధి కల్పించిందని అధికారులు తెలిపారు. మిగతా 30 శాతం పనిదినాలను కూడా ఈ నెలాఖరుతో పూర్తి చేయగలమని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రం గత నాలుగేళ్లుగా ప్రతేడాది 10 కోట్లకుపైగా పనిదినాలను పూర్తి చేస్తూ వస్తున్నందున, 2025-26 ఆర్థిక సంవత్సరానికి 12 కోట్ల పనిదినాల కేటాయింపును కోరింది. అయితే కేంద్రం 6.50 కోట్ల పనిదినాలకే పరిమితం చేసింది.

Details

సగటు వేతనం రూ.250.75 

గత రెండు నెలల్లో 18.9 లక్షల కుటుంబాలకు చెందిన 28.48 లక్షల మంది కూలీలకు పని కల్పించడం జరిగింది. ఒక్కో కుటుంబానికి సగటున 24 రోజుల పనిదినాలు లభించగా, 1,127 కుటుంబాలు 100 రోజుల పనిదినాలను పూర్తి చేశాయి. ఒక్కో కూలీకి రోజువారీ వేతనంగా సగటున రూ.250.75 చెల్లించారు. మే నెలాఖరు నాటికి పూర్తయిన పనుల్లో వ్యవసాయ అనుబంధ పనులకు 50 శాతం వాటా ఉంది. నీటి కుంటలు, పశువుల కొట్టాలు, మొక్కలు నాటించడం తదితర లక్షకుపైగా పనులు కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సీసీ రోడ్లు తదితర 1.31 లక్షల పనులు పురోగతిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Details

 అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం 

మే నెలాఖరునాటికి ఈ పథకంలో రూ.1,416 కోట్లు ఖర్చుచేయగా, అందులో రూ.1,151.67 కోట్లు వేతనాలకే, రూ.191.03 కోట్లు సామగ్రికే ఖర్చయినట్టు వెల్లడించారు. జూన్‌ 20వ తేదీ నాటికి 1.50 కోట్ల పనిదినాలను పూర్తిచేయగా, నెలాఖరునాటికి మరిన్ని 50 లక్షల పనిదినాలను పూర్తి చేయగలమని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే కేంద్రం నిర్దేశించిన 6.50 కోట్ల పనిదినాల లక్ష్యం ఈ నెలాఖరునాటికే పూర్తవుతుంది. పనిదినాల సంఖ్యను 12 కోట్లకు పెంచాలని కేంద్రాన్ని అభ్యర్థించనుంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. ఇదే అంశంపై సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధానమంత్రి మోడీ, కేంద్రమంత్రికి లేఖ రాసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.