Page Loader
PM Modi: 'వికసిత్ భారత్'లో ఆరెస్సెస్‌ పాత్ర కీలకం: ప్రధాని మోదీ
'వికసిత్ భారత్'లో ఆరెస్సెస్‌ పాత్ర కీలకం: ప్రధాని మోదీ

PM Modi: 'వికసిత్ భారత్'లో ఆరెస్సెస్‌ పాత్ర కీలకం: ప్రధాని మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2025
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS)ను భారత అజరామర సంస్కృతికి మహావృక్షంగా అభివర్ణించారు. ప్రధానిగా పదవి చేపట్టిన 11 ఏళ్ల తర్వాత, తొలిసారి ఆయన నాగ్‌పుర్‌లోని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా హెడ్గేవార్‌ స్మృతి మందిరానికి వెళ్లి, ఆరెస్సెస్‌ వ్యవస్థాపకుడు కేశవ బాలిరాం హెడ్గేవార్, రెండో సర్‌సంఘ్‌చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్‌లకు నివాళులర్పించారు. అనంతరం 1956లో డా. బీఆర్ అంబేడ్కర్‌ బౌద్ధమతాన్ని స్వీకరించిన 'దీక్షభూమి'ను దర్శించారు. అదనంగా, మాధవ్‌ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.

Details

సేవకు పర్యాయపదం ఆరెస్సెస్

భారత సంస్కృతి, ఆధునికీకరణకు ఆరెస్సెస్‌ మర్రిచెట్టులాంటిది. ఈ సంస్థ సేవకు పర్యాయపదం. సంఘ్‌ కార్యకర్తలు వివిధ రంగాల్లో నిస్వార్థంగా పనిచేస్తున్నారు. గత వందేళ్లలో ఆరెస్సెస్‌ చేసిన తపస్సు.. దేశం 'వికసిత్ భారత్' దిశగా సాగుతున్న తరుణంలో ఫలాలు ఇస్తోందని ఆయన ప్రధాని మోదీ కొనియాడారు. రాజ్యాంగానికి 75 ఏళ్ల వేడుక వేళ.. ఆరెస్సెస్‌ వందేళ్లు పూర్తి చేసుకుంటోందని పేర్కొన్నారు. సంఘ్‌ చీఫ్‌ మోహన్ భాగవత్ మాట్లాడుతూ, నిస్వార్థ సేవ తమ సిద్ధాంతమని తెలిపారు. ప్రజలకు సరైన ఆరోగ్య సౌకర్యాలు అందించాలన్న ఉద్దేశంతో మాధవ్ నేత్రాలయలో ఆరెస్సెస్‌ వాలంటీర్లు పేదలకు సేవలు అందిస్తున్నారని వెల్లడించారు.

Details

చివరిసారిగా 2017లో సందర్శించిన మోదీ

బీఆర్ అంబేడ్కర్‌ 'దీక్షభూమి'ను సామాజిక న్యాయం, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించే చిహ్నంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. రాజ్యాంగ నిర్మాత కలలుగన్న దేశాన్ని సాకారం చేసేందుకు మరింత కృషి చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన, సంఘటిత భారత్‌ను నిర్మించడమే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అని తెలిపారు. మోదీ చివరిసారిగా 2017లో దీక్షభూమిని సందర్శించారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ అనంతరం, ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రెండో సిట్టింగ్‌ ప్రధానిగా మోదీ నిలిచారు. నాగ్‌పుర్‌లోని 'సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్' మందుగుండు సామగ్రి కేంద్రాన్నీ ఆయన పరిశీలించారు.