Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు?..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను తెలంగాణకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ పదవికి సంజయ్ జాజుతో పాటు జయేశ్ రంజన్ పేరును కూడా ముఖ్యమంత్రి పరిశీలించినప్పటికీ, చివరకు సంజయ్ జాజు వైపే మొగ్గు చూపినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వివరాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక హోదాల్లో సంజయ్ జాజు
1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక హోదాల్లో సేవలందించారు. విజయవాడ సబ్ కలెక్టర్గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆయన, హైదరాబాద్ నగరపాలక సంస్థలో అదనపు కమిషనర్గా, అనంతరం కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే పౌరసరఫరాల శాఖ కమిషనర్గా కూడా సేవలందించారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో కొనసాగుతున్న సంజయ్ జాజును తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఆయనకు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసు గడువు ఉంది.