Supreme Court: విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. పోలీసులకు సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
నిరసన ప్రదర్శనల సమయంలో భద్రతా బలగాలు, పోలీసులు అత్యంత సంయమనంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల ఎస్జేపీ నిర్వహించిన 'చలో పార్లమెంట్' మార్చ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసకు బాధ్యులైన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ను విచారిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సీజే జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మాట్లాడుతూ, కొంతమంది వ్యక్తులు రాళ్లు రువ్వడం లేదా ఉద్రిక్తతకు పాల్పడినా, యువతను శాంతింపజేయడం అధికారుల తొలి బాధ్యత కావాలని పేర్కొంది. బలప్రయోగంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం కంటే, వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకోవడం, అవసరమైతే కౌన్సెలింగ్ ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించడం మరింత సమర్థవంతమైన విధానమని అభిప్రాయపడింది.
వివరాలు
బలప్రయోగం కాదు.. యువతతో సంభాషణే పరిష్కారం: సుప్రీంకోర్టు
ప్రభుత్వం తరఫున కూడా అతిగా కఠిన వైఖరి ప్రదర్శిస్తే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అందువల్ల ఇలాంటి సందర్భాల్లో శాంతియుత దృక్పథంతో వ్యవహరించడం అవసరమని సూచించింది.
ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నప్పుడు పోలీసులు సహనం కోల్పోకుండా పరిస్థితిని అదుపులో ఉంచేలా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
యువత ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారో,వారి సమస్యలు ఏమిటో ముందుగా వినడం ఎంతో అవసరమని తెలిపింది.
వారి ఆందోళనలకు కారణమైన అంశాలను అర్థం చేసుకోవడమే సమస్యపరిష్కారానికి అత్యంత ప్రభావవంతమైన మార్గమని స్పష్టం చేసింది.
అదేవిధంగా,ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో చట్టాన్ని అమలు చేసే సంస్థలకు తగిన అవగాహన,అనుభవం ఉన్నాయని,ఆయా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వారికి ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది.