Voter List Revision: ఓటర్లకు కీలక సమాచారం.. ఆగస్టు 22 నుంచి నాలుగు రోజులు ప్రత్యేక శిబిరాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో నాలుగు రోజుల పాటు 'ప్రత్యేక ప్రచార దినాలు' (స్పెషల్ క్యాంపెయిన్ డేస్) నిర్వహించనున్నారు. ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ఈ కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. ఈ ప్రత్యేక దినాల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు), రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ఓటర్ల నమోదు, వివిధ ఫారాల పూర్తి, ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వివరాలు
సవరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్/సర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని వివేక్ యాదవ్ అధికారులను కోరారు.
సచివాలయం నుంచి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వర్చువల్గా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సర్ ప్రక్రియ పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మ్యాపింగ్ కాని ఓటర్లు, మ్యాపింగ్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయడంతో పాటు వాటిపై విచారణలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
అలాగే ఓటర్ల నుంచి వచ్చిన క్లెయిమ్లు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.
వివరాలు
పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి
బీఎల్వోలతో నిర్వహించే 'బుక్ ఏ కాల్'కు సంబంధించిన పెండింగ్ అంశాలను కూడా వెంటనే పరిష్కరించాలని ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
ఎన్జీఎస్పీ (నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్)లో నమోదైన ఫిర్యాదులను సైతం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
యువ ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు
18 ఏళ్లు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు విద్యా సంస్థల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని వివేక్ యాదవ్ సూచించారు.
అర్హత ఉన్న ప్రతి యువకుడు, యువతి ఓటరుగా నమోదు అయ్యేలా అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీరావు పాల్గొన్నారు.