Supreme Court: 'డిజిటల్ అరెస్ట్'మోసాలు అత్యంత దారుణమైన నేరాలు.. బెయిల్కు సుప్రీంకోర్టు కఠిన షరతులు
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల కేసుల్లో నిందితులకు సాధారణంగా బెయిల్ ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విడుదలకు ప్రత్యేక కారణాలు ఉన్నాయని నిందితులు నిరూపిస్తేనే బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ మోసాలు ప్రజలపై జరుగుతున్న అత్యంత ఘోర నేరాల్లో ఒకటిగా అభివర్ణించింది.
వివరాలు
బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, న్యాయమూర్తులు జోయ్మాల్య బాగ్చి, వి. మోహనతో కలిసి డిజిటల్ మోసం కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ను సోమవారం తిరస్కరించింది.
తాను ప్రధాన నిందితుడికి బ్యాంకు ఖాతా తెరవడంలో మాత్రమే సహాయం చేశానని, ఏడాదికి పైగా జైలులో ఉన్నానని నిందితుడు వాదించాడు.
అయితే, నేరానికి అతడూ సహకరించిన వ్యక్తేనని ధర్మాసనం తేల్చింది.
డిజిటల్ అరెస్ట్ కేసుల్లో ప్రత్యేక కారణాలు లేకపోతే బెయిల్ మంజూరు చేయబోమని స్పష్టం చేసింది.
వివరాలు
'ఇది అత్యంత దారుణమైన నేరం'
దేశంలోని అన్ని హైకోర్టులు, ట్రయల్ కోర్టులకు సందేశం ఇస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
డిజిటల్ అరెస్ట్ మోసాలు ప్రజలపై జరుగుతున్న అత్యంత తీవ్రమైన నేరాల్లో ఒకటని పేర్కొంది.
ప్రత్యేకించి వృద్ధులు జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న పొదుపు సొమ్మును, అత్యవసర సమయంలో మోసగాళ్లు దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
అందుకే ఈ తరహా నేరాలను అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
వివరాలు
సైబర్ మోసాలపై కఠిన చట్టాలు అమలు చేయాలి
గత శుక్రవారం కూడా ఇదే ధర్మాసనం డిజిటల్ అరెస్ట్, సైబర్ మోసాలకు పాల్పడిన వారిపై సంఘటిత నేరాల నిరోధక చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని దర్యాప్తు సంస్థలకు సూచించింది.
ఈ తరహా నేరాలను సాధారణ మోసాలుగా కాకుండా దోపిడీ, దొంగల దాడుల మాదిరిగానే అత్యంత తీవ్రమైన నేరాలుగా పరిగణించాలని పేర్కొంది.
వివరాలు
డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు ప్రత్యేక నిఘా
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తోంది.
ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలపై గత ఏడాది ప్రత్యేక దృష్టి సారించింది.
దేశవ్యాప్తంగా నమోదైన ఇలాంటి కేసుల దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించడంతో పాటు, వివిధ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించింది.
దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం, డిజిటల్ అరెస్ట్ మోసాల ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.3,000 కోట్లకు పైగా ప్రజల నుంచి కాజేసినట్లు వెల్లడైంది.