Telangana: రైల్వే ప్రాజెక్టులపై కీలక అప్డేట్.. డోర్నకల్-గద్వాల కొత్త లైన్కు సర్వే పూర్తి: అశ్వినీ వైష్ణవ్
ఈ వార్తాకథనం ఏంటి
డోర్నకల్ నుంచి గద్వాల వరకు ప్రతిపాదించిన 296 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవి అడిగిన ప్రశ్నకు ఆయన లోక్సభలో ఈ విషయాన్ని స్పష్టంచేశారు. డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీ కోసం నిర్వహించిన సర్వే ప్రకారం ఈ రైల్వే లైన్ సూర్యాపేట, నల్గొండ,కల్వకుర్తి, నాగర్కర్నూలు,వనపర్తి ప్రాంతాల మీదుగా వెళ్లనుంది. డీపీఆర్ పూర్తయ్యిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం,నీతి ఆయోగ్, అలాగే ఆర్థిక శాఖలతో చర్చలు జరిపి, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అలాగే జడ్చర్ల నుంచి నంద్యాల వరకు 182కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సర్వే పూర్తయిందని చెప్పారు.
వివరాలు
రైల్వే ప్రాజెక్టుల కోసం మొత్తం 2,343 హెక్టార్ల భూమి
అయితే ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే అవకాశముందని సర్వేలో తేలిందని పేర్కొన్నారు. ఇక 2022-23 నుంచి 2025-26 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 18 కొత్త రైల్వే లైన్లు, 39 డబ్లింగ్ పనులకు సంబంధించిన సర్వేలకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల మొత్తం పొడవు 5,665 కిలోమీటర్లుగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టుల కోసం మొత్తం 2,343 హెక్టార్ల భూమి అవసరమైందని చెప్పారు. అందులో ఇప్పటివరకు 1,580 హెక్టార్లు (67%) సేకరించగా,ఇంకా 764 హెక్టార్లు (33%)సేకరించాల్సి ఉందని వివరించారు. భూసేకరణలో ఆలస్యం కారణంగా గుంటూరు-బీబీనగర్,ముద్ఖేడ్-మేడ్చల్,మహబూబ్నగర్-డోన్ డబ్లింగ్, కాజీపేట-విజయవాడ మూడో లైన్, మనోహరాబాద్-కొత్తపల్లి కొత్త లైన్ వంటి ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని మంత్రి తెలిపారు.