Swatantra Bharadwaj: స్వతంత్ర భరద్వాజ్ అరెస్టు.. యూపీలో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా ఓ విద్యార్థి తండ్రిపై తాను దాడి చేసి, ఆయన తల పగలగొట్టానని చెప్పుకున్న హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని బులంద్షెహర్ జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, ఎంపీ పప్పు యాదవ్లతో కలిసి కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. స్వతంత్ర భరద్వాజ్ను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
వివరాలు
అసలేం జరిగింది?
72 గంటల్లో అతడిని అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో సీజేపీ కార్యకర్తలు ఆందోళనను విరమించారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే భరద్వాజ్ను పోలీసులు అరెస్టు చేశారు.
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు జూన్ 23న జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించారు.
ఈనిరసనను విద్యార్థిని నిషూ ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్ తన ఫోన్లో రికార్డు చేస్తుండగా వాగ్వాదం మొదలైంది.
ఈక్రమంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి ఆయనపై దాడి చేశారు. దీంతో ఘర్షణ తీవ్రరూపం దాల్చింది.తన తలపై పిడిగుద్దులు కురిపించడంతో పాటు ఇనుప కడియం వంటి గట్టి వస్తువుతో కూడా కొట్టారని సంజయ్ కుమార్ ఆరోపించారు.
ఆయన తలపై రెండు బలమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
వివరాలు
నిషూ ఆజాద్ తండ్రికి 60 కుట్లు
ఈ ఘటనపై దాడికి పాల్పడిన స్వతంత్ర భరద్వాజ్, సూరజ్ కుమార్లపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా.. స్వతంత్ర భరద్వాజ్ మాట్లాడిన ఓ పాడ్కాస్ట్ క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అందులో భరద్వాజ్ తనను తాను కట్టర్ హిందూ (కరుడుగట్టిన హిందువు)గా అభివర్ణించుకున్నాడు. సంజయ్ కుమార్ పుర్రెను తానే పగలగొట్టినట్లు కూడా అతడు చెప్పుకున్నాడు.
వైరల్ వీడియోలో భరద్వాజ్ మాట్లాడుతూ.. 'ఈ నేరం ఏ సెక్షన్ పరిధిలోకి వస్తుందో మీకు తెలుసా? సెక్షన్ 307. నిషూ ఆజాద్ తండ్రికి 60కుట్లు పడ్డాయి.
అతడిని అంబులెన్స్లో తరలించారు. తన తండ్రికి న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్ బయట నిలబడి అతడి కుమార్తె నిషూ ఆజాద్ అంటోంది.
వివరాలు
నిజం ప్రపంచానికి తెలియాలి
కానీ నన్ను కనీసం జైలులో కూడా పెట్టలేదు. ఈ విషయం ప్రపంచానికి తెలియాలి. రాత్రంతా నేను బయట తిరుగుతూనే ఉన్నాను. నాకు హనుమంతుని ఆశీస్సులు ఉన్నాయి.
కపిల్ మిశ్రా నాకు అన్నయ్య అవుతారు. కపిల్ మిశ్రా ఫోన్ చేయడం వల్లే నేను విడుదలయ్యానని అంటుంటారు.
కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా నాకు అన్నయ్యే. మీకు ఎంతమంది నాయకులు తెలుసు? మోదీజీ తెలుసా? మోదీజీ కూడా నాకు అన్నయ్యే. అందరి మద్దతు నాకు ఉందని పేర్కొన్నాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. భరద్వాజ్ను అరెస్టు చేయాలని సీజేపీ కార్యకర్తలు శుక్రవారం ఆందోళనకు దిగారు.
వివరాలు
ఆత్మరక్షణ కోసమే దాడి చేశానన్న భరద్వాజ్
విద్యార్థిని నిషూ ఆజాద్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. భరద్వాజ్ను ఎందుకు జైలులో పెట్టలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
అతడికి రాజకీయ రక్షణ లభిస్తోందని ఆరోపించారు. అయితే రాజకీయ జోక్యం ఉందన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. భరద్వాజ్ను అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు
అందులో తాను ఆత్మరక్షణ కోసమే దాడికి దిగాల్సి వచ్చిందని భరద్వాజ్ వివరణ ఇచ్చాడు. 'ఒకవేళ నేను ఆత్మరక్షణలో భాగంగా వ్యవహరించి ఉండకపోతే ఆ గుంపు నన్ను కొట్టి చంపి ఉండేది.
నా ప్రాణాలు కచ్చితంగా పోయేవి. జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై నేను దాడి చేయడానికి ప్రయత్నించలేదని నిరూపించడానికి వీడియో సాక్ష్యం ఉందని అతడు పేర్కొన్నాడు.