Telangana: తెలంగాణ రైతులకు శుభవార్త.. యూరియా బుకింగ్లో కొత్త నిబంధనలు అమల్లోకి ..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో యూరియా పంపిణీని మరింత సులభతరం చేస్తూ తెలంగాణ వ్యవసాయశాఖ సోమవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. యూరియా యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే రైతులకు భూవిస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని కొనుగోలు చేసే అవకాశాలను విస్తరించింది. కొత్త నిబంధనల ప్రకారం, మూడెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు యూరియా యాప్లో బుకింగ్ చేసుకుంటే ఒకే దఫాలో ఆరు బస్తాల యూరియాను ఎరువుల విక్రయ కేంద్రాల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో చిన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. అలాగే, ఐదెకరాల భూమి ఉన్న రైతులు రెండు విడతల్లో యూరియాను పొందే అవకాశం ఉంటుంది.
వివరాలు
వెయిటింగ్ లిస్ట్ నంబర్ కేటాయించాలి
ఆరు ఎకరాల భూమి కలిగిన రైతులు మూడుదఫాల్లో తమకు అవసరమైన యూరియాను తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఇక యూరియా కోసం రైతులు ఏదైనా విక్రయ కేంద్రంలో ముందుగా బుకింగ్ చేసుకున్నప్పటికీ, అక్కడ తక్షణం నిల్వలు లేక ఎరువు అందుబాటులో లేకపోతే వారికి వెయిటింగ్ లిస్ట్ నంబర్ కేటాయించాలని అధికారులను ఆదేశించింది.
అంతేకాకుండా,తదుపరి యూరియా నిల్వలు విక్రయ కేంద్రానికి చేరుకునే తేదీ,సమయాన్ని సంబంధిత రైతుకు ముందుగానే తెలియజేయాలి.
ఆరోజు రైతు వచ్చి బుక్ చేసిన యూరియా స్టాక్ను సులభంగా పొందేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయశాఖ సూచించింది.
ఈ విధానం ద్వారా రైతులు ఎరువుల కోసం పలుమార్లు విక్రయకేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి,పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.