బీజేపీకి షాక్.. గులాబి గూటికి బిత్తిరి సత్తి, బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి
తెలంగాణలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ, పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం రాత్రి మంత్రి కేటీఆర్ సమక్షంలో బి.మోహన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరిపోయారు. విద్యారంగ, ఉపాధ్యాయ అంశాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో పని చేసేందుకు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే గురువారం ప్రగతి భవన్ లో బిత్తిరి సత్తితో మంత్రులు చర్చలు జరిపారు.
ముదిరాజులంతా బీఆర్ఎస్ లోకి రావాలని మంత్రుల ఆహ్వానం
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారు, ముదిరాజ్ నేతలు బీఆర్ఎస్ తో కలిసి పని చేయాలని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కోరారు. దీంతో బీఆర్ఎస్ లో చేరేందుకు అంగీకరించినట్లు బిత్తిరి సత్తి వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధిక మంది జనాభా ఉన్న ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన మరి కొంతమంది కీలక నేతలు కూడా త్వరలో గులాబీ పార్టీకే జై కొట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కీలక నేత కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.