
Telangana Cabinet expansion: నేడే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. ముగ్గురికి పదవులు ఖాయం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు వేదిక ఫిక్సయింది.
ఆదివారం మధ్యాహ్నం 12:00 నుండి 12:20 గంటల మధ్య ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందులో బీసీల నుంచి వి. శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్ (మాల) అడ్లూరి లక్ష్మణ్కుమార్ (మాదిగ)లకు మంత్రిపదవులు లభించనున్నాయి.
శాసనసభ ఉప సభాపతిగా రామచంద్రునాయక్ నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విస్తరణలో సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేలా అధిష్ఠానం స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చింది.
అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే విస్తరణలో సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిల పేర్లు చర్చకు వచ్చినప్పటికీ, సామాజిక సమతుల్యత దృష్టిలో ఉంచుకుని ఈ దఫా వారిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
Details
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్!
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్రెడ్డికి అవకాశం ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ, కేంద్ర అధిష్ఠానం కొంత వెనుకంజ వేసినట్లు సమాచారం.
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మంత్రి చేస్తే, ఆయన సోదరుడు వెంకట్రెడ్డిని కొనసాగించడం కష్టమవుతుందనే కారణంతో ఇద్దరిలో ఒకరినే ఎంపిక చేయాలన్న అధిష్ఠానం సూచింది.
మంత్రివర్గ విస్తరణకు ముందు సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో అధిష్ఠానం చర్చలు జరిపింది.
అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని శనివారం తుది అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.
Details
చీఫ్ విప్ పదవి భర్తీపై కూడా చర్చలు
సీఎం అనంతరం పలువురు నేతలతో చర్చించి ముగ్గురు పేర్లపై స్పష్టతకు వచ్చారు. ప్రస్తుతం మంత్రివర్గంలో మూడు ఖాళీలను భర్తీ చేయగా, మరో మూడు స్థానాలు ఇంకా మిగిలి ఉన్నాయి.
చీఫ్ విప్ పదవి భర్తీపై కూడా పార్టీ చర్చిస్తోంది. బీసీ వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ ప్రస్తుతం విప్గా ఉన్నారు.
గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదన్న కారణంగా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్కుమార్కు మంత్రిపదవి, అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి సభాపతి పదవి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇక మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఒకరికి చీఫ్ విప్ పదవి ఇచ్చే మార్గాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోంది.
Details
సామాజిక న్యాయానికి అనుగుణంగా విస్తరణ
మీనాక్షి నటరాజన్ నాలుగు రోజులుగా హైదరాబాద్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరిపిన నేపథ్యంలో సామాజిక న్యాయానికి అనుగుణంగా విస్తరణ ఉండాలన్న అభిప్రాయాన్ని అధిష్ఠానానికి తెలిపారు.
అంతేకాకుండా, ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ పేరొందిన నేపథ్యంలో, మాదిగ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యేలు సీఎం నివాసానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు.
అడ్లూరి లక్ష్మణ్కుమార్, వేముల వీరేశం, సామేల్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్యలు సీఎంను కలిసి తమ వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదన్న ఆక్రోశం, మంత్రివర్గంలో తప్పనిసరిగా చోటు ఇవ్వాలన్న డిమాండ్ నేపథ్యంలో ఈ వర్గానికి ప్రాధాన్యత లభించింది.