
TG Inter Board: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ విషయంలో కీలక ప్రకటనను విడుదల చేసింది.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైనట్టు బోర్డు స్పష్టం చేసింది.
మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థుల కోసం తెలుగు అకాడమీ ద్వారా పాఠ్య పుస్తకాల ముద్రణ ఇప్పటికే పూర్తయ్యిందని పేర్కొంది.
ఆయా పుస్తకాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైందని, ఈ ప్రక్రియ 2025 జూన్ మొదటి వారంలోపే పూర్తవుతుందని బోర్డు తెలియజేసింది.
వివరాలు
జూన్ మొదటి వారంలో ముద్రణ పూర్తి
ఇక ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్టు పేర్కొంది.
జూన్ మొదటి వారంలో ముద్రణ పూర్తవుతుందని అంచనా వేసింది.
అలాగే 2024-25 విద్యా సంవత్సరానికి ముద్రించినా వినియోగించని పుస్తకాలను మళ్లీ అవసరమున్న చోట్లకు పంపిణీ చేస్తామని వెల్లడించింది.
పాఠ్యపుస్తకాల పంపిణీ పనిని జూన్ మధ్య నాటికి 100 శాతం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులందరికీ సమయానికి పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది.
వివరాలు
ఇంటర్మీడియట్ కాలేజీల సమయాల మార్పు
ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ విద్యా సంవత్సరానికి ప్రత్యేకంగా ఇంటర్ బోర్డు పలు సమయాల్లో మార్పులు చేసింది.
ఇప్పటివరకు ప్రతి ఏడాది జూన్ 1న విద్యా సంవత్సరం మొదలవుతుండగా, ఈ ఏడాది మాత్రం ఏప్రిల్ 1 నుంచే తరగతులను ప్రారంభించినట్టు తెలుస్తోంది.
ఏప్రిల్ 1 నుంచి 23 వరకు తరగతులు నిర్వహించిన తర్వాత వేసవి సెలవులు ప్రకటించిన బోర్డు, ఇప్పుడు మళ్లీ 2025-26 విద్యా సంవత్సరాన్ని పునఃప్రారంభించనుంది.
ఇంకా, ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్తగా ఎంబైపీసీ కోర్సును ప్రవేశపెట్టారు. విద్యార్థులకు ఈ కొత్త కోర్సు చదివే అవకాశాన్ని కల్పించినట్లు సమాచారం.