Telangana: తెలంగాణలో మళ్లీ వర్షాలు.. హైదరాబాద్ సహా 20 జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మళ్లీ వానల జోరు మొదలైంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది. రాజధాని హైదరాబాద్తో పాటు మొత్తం 20 జిల్లాలకు వర్ష సూచనను ప్రకటించింది. వీటిలో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మేడ్చల్,నల్లగొండ,రంగారెడ్డి,సంగారెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్,నిజామాబాద్,కరీంనగర్,వరంగల్,ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు.
వివరాలు
మిగతా జిల్లాల్లోనూ వర్ష సూచన
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతూ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.
ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.