Telangana:అంగన్వాడీ చిన్నారులకు శుభవార్త.. ఆగస్టు నుంచి తొలిముద్ద
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆగస్టు నెల నుంచి 'తొలిముద్ద' అల్పాహార పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. చిన్నారుల పోషకాహారాన్ని మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. అంగన్వాడీ మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మరో 3 వేల అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మంజూరైన 2,500 అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే, వాటిని ఒకేసారి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
వివరాలు
జిల్లా సంక్షేమ అధికారులతో సమీక్ష సమావేశం
బుధవారం సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి శృతి ఓజాతో కలిసి మంత్రి సీతక్క జిల్లా సంక్షేమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శాఖ పరిధిలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల పురోగతి, అంగన్వాడీ సేవల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేశారు.