BJP vs TMC: పశ్చిమబెంగాల్లో ఉద్రిక్తత.. ఘర్షణలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన మరో ఎంపీపై ఆదివారం ఉదయం దాడి జరగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. హుగ్లీ జిల్లాలోని చెండితాల పోలీస్ స్టేషన్ బయట టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గాయపడ్డారు. పార్టీ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కేంద్ర బలగాల సిబ్బంది ఆయనను అడ్డుకుని ప్రశ్నించారు. ఇదే సమయంలో వెనుక నుంచి విసిరిన రాయి ఆయన తలకు తగలడంతో కళ్యాణ్ బెనర్జీ ఒక్కసారిగా నేలపై కుప్పకూలారు. ఇటీవల అరెస్టైన తమ పార్టీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఎంసీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో వినతిపత్రం సమర్పించేందుకు అక్కడికి చేరుకున్నారు.
వివరాలు
కేంద్ర బలగాల మోహరింపు
అదే సమయంలో భాజపా కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చి నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అనంతరం ఘర్షణకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ సంఖ్యలో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలను సంఘటన స్థలానికి మోహరించారు. ఈ ఘటనపై స్పందించిన ఎంపీ కల్యాణ్ బెనర్జీ, తాను పోలీస్ స్టేషన్కు వెళ్తున్న సమయంలోనే దాడి జరిగిందని తెలిపారు. వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన తమ పార్టీ కార్యకర్తలపై కూడా ఎలాంటి కారణం లేకుండా దాడి చేశారని ఆయన ఆరోపించారు.