Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కీలక సాక్షికి బెదిరింపులు
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కీలక సాక్షికి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అత్యాచారం కేసులో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత తనకు హత్య బెదిరింపులతో ఫోన్ కాల్స్ వచ్చాయని సామాజిక కార్యకర్తగా ఉన్న సాక్షి బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు వెల్లడించారు. తనతోపాటు తన కుమారుడి భద్రతపైనా ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఏదైనా హాని జరిగితే అందుకు ప్రజ్వల్ రేవణ్ణనే పూర్తిగా బాధ్యుడిగా పరిగణించాలని ఆమె కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రత్యేక న్యాయస్థానం.. సాక్షికి తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. బెదిరింపు కాల్స్పై సమగ్రంగా దర్యాప్తు చేయాలని కూడా సూచించింది.
వివరాలు
బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులు,ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు
2024 లోక్సభ ఎన్నికల సమయంలో వెలుగులోకి వచ్చిన ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన లైంగిక వేధింపుల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి.
వాటిలో ఒకకేసులో ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా నిర్ధారణ కావడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
ప్రస్తుతం ఆయన పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మరో కేసులో కీలక సాక్షికి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కోర్టు ఆదేశాలతో సాక్షితోపాటు ఆమె కుటుంబ సభ్యుల భద్రతపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
అదే సమయంలో బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులు,ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు చేపట్టనున్నారు.